మాకోసం ఏమి చేయలేదు, వైఎస్కు దగ్గరైనా!, జగన్కు ఆత్మ: విజయసాయిరెడ్డిపై సొంతూరిలో ఇలా
నెల్లూరుకు సమీపంలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామం విజయసాయిరెడ్డి స్వస్థలం. సామాన్య రైతు కుటుంబ నేపథ్యం నుంచి మంచి చార్టెడ్ అకౌంటెండ్గా విజయసాయిరెడ్డి ఎదిగారు.
నెల్లూరు: రాజకీయ పార్టీల్లో నంబర్.1, నంబర్.2 లెక్కలు సర్వసాధారణం. కానీ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలో మాత్రం నంబర్-1 నుంచి మొదలుపెట్టి అన్ని స్థానాల్లో జగనే కనిపిస్తారన్న విమర్శ ఉంది. పార్టీలో మరో వ్యక్తి తనకు పోటీగా ఉండటం జగన్ అసలు ఇష్టపడరని, నిర్ణయాల విషయంలోను ఆయనది ఏకపక్ష వైఖరి అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.
ఈ సంగతి పక్కనపెడితే.. పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డే పెద్ద దిక్కుగా కనిపిస్తారు. అందుకే వైసీపీలో ఆయనే నంబర్.2 అనేవారు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి ఓ ఆసక్తికర కథనం తెర మీదకు వచ్చింది. అసలు వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డికి సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?.. అసలాయన కెరీర్ మొదలైందన్నది దాని సారాంశం.
స్వస్థలం నెల్లూరు, చార్టెడ్ అకౌంటెంట్:
నెల్లూరుకు సమీపంలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామం విజయసాయిరెడ్డి స్వస్థలం. సామాన్య రైతు కుటుంబ నేపథ్యం నుంచి మంచి చార్టెడ్ అకౌంటెండ్గా విజయసాయిరెడ్డి ఎదిగారు. ఒక ప్రముఖ సంస్థలో కొన్నాళ్లు ఆడిటింగ్ వ్యవహారాల బాధ్యతలు నిర్వర్తించారు.
2003 నుంచి వైఎస్తో అనుబంధం:
2003- 2004 మధ్యకాలంలో విజయసాయిరెడ్డి వైఎస్ రాజశేఖర్రెడ్డికి దగ్గరయ్యారు. తర్వాతి కాలంలో జగన్ కంపెనీలు, పెట్టుబడులు, వాటికి సంబంధించిన ఆడిటింగ్ వ్యవహారాలన్ని ఆయనే చూసుకున్నారు. ఇదే క్రమంలో జగన్ కంపెనీలపై అవకతవకల ఆరోపణలు రావడం.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డిని ఏ-2గా చేర్చడం జరిగిపోయాయి.
తాళ్లపూడి ప్రజలు ఏమంటున్నారు?:
సహజంగానే పుట్టిన ఊరంటే ఎవరికైనా ప్రత్యేక అభిమానం ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తమ ఊరి వైపు అసలు తొంగైనా చూడటం లేదని తాళ్లపూడి గ్రామ ప్రజలు చెబుతున్నారు. కనీసం స్నేహితులను, బంధువులను కూడా ఎప్పుడూ ఫోన్ లోనైనా పలకరించరట.
చాలా రోజుల క్రితం ఓసారి తాళ్లపూడి వెళ్లిన విజయసాయిరెడ్డి.. అప్పటినుంచి మళ్లీ అటు వైపు చూడనే లేదట. వైఎస్ తో సన్నిహిత సంబంధాలున్న సమయంలోను తాళ్లపూడి గ్రామానికి ఆయనేం చేయలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు.
వైఎస్కు కేవీపీలా.. జగన్కి విజయసాయి:
సొంత జిల్లా అయినప్పటికీ విజయసాయిరెడ్డి కనీసం అడపాదడపా కూడా జిల్లాకు రాకపోవడం పట్ల తాళ్లపూడి గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి జిల్లాలో జగన్ పర్యటించిన సందర్భంలోను ఆయన కనిపించకపోవడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవిధంగా వైఎస్కు కేవిపీ లాగా.. జగన్కు విజయసాయిరెడ్డి ఆత్మ లాగా వ్యవహరిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో దోస్తీ దిశగా అడుగులు కూడా విజయసాయిరెడ్డి సలహానే అన్న ఊహాగానాలు వారి నుంచి వినిపిస్తున్నాయి.
ఇక మొన్నటి నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ పరాజయానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బెడిసికొట్టడమే కారణమని అక్కడివారు అనుకుంటున్నారట. అంతేకాదు, జగన్ తన వైఖరి మార్చుకోకపోతే వైసీపీకి భవిష్యత్తు కష్టాలు తప్పవని చర్చించుకుంటున్నారట.