టీడీపీ అధ్యక్ష పదవి.. ముళ్లం కిరీటం అతనికే.. విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్..
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారన్న అంశంపై గత కొద్ది రోజులుగా వాడి వేడి చర్చ జరుగుతోంది. అదే సమయంలో ట్విట్టర్లో పుట్టుకొచ్చిన ఓ ఫేక్ అకౌంట్.. టీడీపీ పగ్గాలు ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికే అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారాన్ని రామ్మోహన్ నాయుడు ఖండించినా.. దీనిపై చర్చ మాత్రం ఆగలేదు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి ట్వీట్..
'కొడుకేమో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. సీనియర్లందరూ చేతులెత్తేశారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలపీఠం ఎక్కిస్తున్నాడు.' అంటూ ట్వీట్ చేశారు.

రామ్మోహన్కు ముళ్ల కిరీటం..
రామ్మోహన్కు ముళ్ల కిరీటం తగిలించబోతున్నారని విజయసాయి పేర్కొనడం.. ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకే అప్పగించబోతున్నారని పేర్కొనడమే. 'పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేయడం వల్ల లోకేష్కు ఉద్రేకం తన్నుకొచ్చినట్టు కనిపిస్తోంది. తాను అధ్యక్ష పదవికి పనికిరానని సొంత తండ్రే సర్టిఫై చేస్తే ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు.' అంటూ ఇటీవలి ఓ ట్వీట్లోనూ విజయసాయి దీని గురించి మాట్లాడారు. ఆయన మాటలను బట్టి చూస్తే.. టీడీపీ సంగతేమో గానీ విజయసాయి రెడ్డి మాత్రం రామ్మోహన్ నాయుడికే పగ్గాలు అప్పగించబోతున్నారని ఫిక్స్ అయినట్టుగా స్పష్టమవుతోంది.
Recommended Video

అధ్యక్ష పదవిపై ఊహాగానాలు..
అధ్యక్ష పదవి ప్రచారాన్ని రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఖండించారు. తనకు పార్టీ తల్లి లాంటిది అని... అధినేత మాటే శిరోధార్యం అని స్పష్టం చేశారు.మరోవైపు అచ్చెన్నాయుడు పేరు కూడా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత కావడం,దూకుడుగా ముందుకెళ్లే స్వభావం ఉండటంతో ఆయన పేరును కూడా అధ్యక్ష పదవి కోసం అధినేత చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు నాయకుల పేర్లను కూడా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పదవి నుంచి తప్పించబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఊహాగానాలన్నీ పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్ష పదవి చివరకు ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠను రేపుతోంది.












Click it and Unblock the Notifications