చిట్టినాయుడు .. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెప్తారన్న విజయసాయి
Recommended Video
మా బాలా మామయ్య మీలా కాదు.. స్వచ్ఛమైన మనసు, నీతి నిజాయితీతో ఎదిగారు అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద, విజయ సాయి మీద ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు నారా లోకేష్. ఇక నారా లోకేష్ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇస్తూ కొద్దిరోజులాగు చిట్టినాయుడు అంటూ ఎవరేమిటో బయటకు వస్తుంది అని సెటైర్ల మీద సెటైర్లు వేశారు.
టీడీపీకి అస్త్రాలుగా సీఎం జగన్ భజన బృందం మాటలు ... వీడియో పోస్ట్ చేసి కామెడీ బయటపెట్టిన నారా లోకేష్
నారా లోకేష్ వర్సెస్ విజయసాయి రెడ్డి .. ఒకరిని మించి ఒకరు సోషల్ మీడియాలో రచ్చ
టీడీపీ నేత నారా లోకేష్ బాబు పబ్లిక్ లో పెద్దగా మాట్లాడకున్నా , ట్విట్టర్ లో మాత్రం దూకుడు చూపిస్తున్నారు. వైసిపి మీద, వైసీపీ నాయకుల మీద, జగన్ మీద మాటల దాడి చేస్తూ టీడీపీపై చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతున్నాడు . ఇక టిడిపి అంటేనే ఒంటికాలిమీద లేచే విజయ సాయి రెడ్డి చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో ఉతికి పారేస్తున్నారు. లోకేష్ కావచ్చు మరెవరైనా కావచ్చు వైసీపీ మీద విమర్శలు చేస్తే వాటికీ నిమిషాల వ్యవధిలోనే కౌంటర్ లిస్తూ సమాధానం చెబుతున్నారు.నిన్న బాలయ్య మీద వైసీపీ నేత విజయసాయి చేస్తున్న ఆరోపణలపై , రాయిస్తున్న తప్పుడు కథనాలపై దీటుగా లోకేష్ స్పందించారు.
బాలా మావయ్య మంచోడు అన్న లోకేష్ .. చిట్టినాయుడు కొద్ది రోజులాగు అన్న విజయసాయి
"తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య." అంటూ సీఎం జగన్ లా నీచమైన చరిత్ర బాలకృష్ణది కాదని వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇక ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి కూడా నారా లోకేష్ కు సమాధానం ఇస్తూ "కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా లో డోస్ పెంచి తిట్టుకుంటున్న నేతలు .. ఇక చాలు ఆపండి అంటున్న ప్రజలు
మీరు మీ ఫేక్ బతుకులు అని నారా లోకేష్ తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తే, మీ ముఖాన కాండ్రించి జనాలు ఉమ్ముతారు అని విజయ సాయి రెడ్డి అంతే తీవ్రంగా విమర్శించారు. మరి దీనిపై నారా లోకేష్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమోగానీ... ఏపీలో రాజకీయ నాయకుల మాటలు మాత్రం హద్దు మీరుతున్నాయి అనేది ప్రజలందరికీ అర్థమవుతోంది.
ప్రజా సమస్యలను పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాల్సిన అధికార పార్టీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, నోటికొచ్చినట్టు తిట్టుకోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఇకనైనా నేతలు ఈ ట్వీట్ వార్ కు స్వస్తి చెప్పి ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది.