గుండె బరువెక్కుతోంది: ఏపీ వర్షాలు, వరద బీభత్సంపై విజయశాంతి ఆవేదన
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల పరిస్థితి అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఏపీ వర్షాలు, వరద పరిస్థితులపై స్పందించారు. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతోందన్నారు.
వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఊళ్ళను ముంచెత్తాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో అయినవారు కళ్ళముందే కొట్టుకుపోయారు. ఇన్నాళ్ళూ తోడుగా ఉండి.... మన ఇంటి మనుషుల్లా... ప్రాణానికి ప్రాణంగా పెంచి పోషించుకున్న పశుసంపద మౌనంగా రోదిస్తూ జలప్రవాహంలో కలిసిపోయింది. పిల్లాపాపల బేల చూపుల మధ్య... ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు విజయశాంతి.

ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాలు తమ శాయశక్తులా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నప్పటికీ... ఈ విపత్కర సమయంలో సహాయక చర్యలు మరింత వేగవంతం కావాలంటే ఆ సిబ్బందికి తోడుగా మరికాస్త మానవవనరుల సహాయం అవసరమనిపిస్తోంది. అందుకే రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి తోడుగా అవసరమైన చోట్ల ఎన్సీసీ విద్యార్థుల సహకారాన్ని కూడా తీసుకుంటే వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబడవచ్చు. చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నాను అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు
తమిళనాడు, ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగవ్వడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరించింది. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
కేవాడియా నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్లే రైలు (నెం.20920) ను బుధవారం రద్దు చేశారు. అలాగే పాట్నా నుంచి బనస్వాడికి నడిచే రైలు (నెం.16054)ను గురువారం రోజు రద్దు చేశారు. వీటితో పాటు తిరుపతి-సికింద్రాబాద్ మద్య నడిచే రైలు (నెం 12763), తిరుపతి- సంత్రాగచ్చి రైలు(నెం.22856), తిరుపతి-కొల్హాపూర్ (నెం.17415) రైళ్లను సోమవారం రద్దు చేసింది. మంగళవారం తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వెళ్లాల్సిన(నెం.17417) , బుధవారం సాయినగర్ షిర్డీ నుంచి తిరుపతికి రావాల్సిన రైలు(నెం.17418), గుంతకల్- రేణిగుంట రైలు(నెం. 07658)ను కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
పలు రైళ్ల పునరుద్ధరణ
Recommended Video
వర్షాలు, వరద ప్రభావం కొంతమేర తగ్గడంతో సోమవారం నుంచి కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. యశ్వంత్ పూర్- హౌరా రైలు(నెం.12864), బెంగళూరు- కాకినాడ రైలు (నెం.17209), యశ్వంత్పూర్- పాటలీపుత్ర రైలు (నెం. 22352), చెన్నై సెంట్రల్- విజయవాడ రైలు (నెం.12712), అహ్మదాబాద్ - చెన్నై సెంట్రల్ రైలు (నెం.22920), మైసూరు- హౌరా రైలు (22818), బెంగళూరు- దానాపూర్ రైలు(నెం.12295), యశ్వంత్ పూర్-టాటానగర్ రైలు (నెం.12890), చెన్నై సెంట్రల్- పూరీ రైలు(22860), తిరునల్వేలి - శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా (నెం.16787) రైలు సర్వీసులను తిరిగి పునరుద్ధరించారు. అయితే వీటి వేళల్లో, రూట్లలో కొద్ది మార్పులు ఉంటాయని, ప్రయాణికులు వీటిని పరిగణనలోకి తీసుకొని, తమ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications