జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ : విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కీలక వివరణ..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ విమానం నిన్న పావుగంటలోనే తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటనపై ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు.
ఏపీలో నిన్న సీఎం వైఎస్ జగన్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. నిన్న సాయంత్రం బయలుదేరిన విమానం కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చింది. ఏసీలో ఎయిర్ ప్రెజర్ కారణంగా విమానం వెనక్కి తిరిగొచ్చినట్లు నిర్ధారణ అయింది. దీంతో సీఎం జగన్ నాలుగు గంటలు ఆలస్యంగా మరో విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
అయితే సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా తిరిగొచ్చి గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై సీఎంవో అధికారులతోనూ, ఎయిర్ పోర్ట్ అధికారులతోనూ సీఎంజగన్ మాట్లాడి తగు సూచనలు కూడా చేశారు. ఈ ఘటన వెనుక గల కారణాలపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు.
నిన్న గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన సీఎం జగన్ ప్రత్యేక విమానం తిరిగి వచ్చి ల్యాండ్ కావడంపై ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి స్పందించారు. సాంకేతిక లోపం ఉందని విమానం వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేశారని ఆయన తెలిపారు. ఎవియేషన్ రంగంలో ఇది సాధారణమేనన్నారు. చిన్న సమస్య ఉన్నా పైలట్ ఇలా వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేస్తారని ఆయన వెల్లడించారు. సాధారణ ప్రయాణికులుంటేనే సీరియస్ గా తీసుకుంటారని, అలాంటిది వీఐపీ ఉన్నారంటే మరింత అప్రమత్తంగా ఉంటారన్నారు. ఈ ఘటనకు పెద్దగా వేరే కారణాలు ఆపాదించాల్సిన అవసరం లేదని లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ : విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కీలక వివరణ..!!#YSJagan #CMJagan #VijayawadaAirport #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/YOtWajdAL6
— oneindiatelugu (@oneindiatelugu) January 31, 2023