విశాఖ ఉక్కు తర్వాత విజయవాడ విమానాశ్రయం?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రయివేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటిస్తోంది. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కర్మాగారం ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని పేర్కొంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగు వెనక్కి వేయడంలేదు. కర్మాగారానికి సంబంధించిన కార్మికులు, ఉద్యోగులు ఏడాదిన్నరగా నిరసన దీక్షలు చేపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో విజయవాడ విమానాశ్రయం కూడా చేరింది.

విమానాశ్రయాల జాబితా
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో కేంద్రం ఈ విషయాన్ని పేర్కొనబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలను ఇస్తున్నాయి. విమానయాన రంగంలో ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. దీనిద్వారా రూ.8వేల కోట్లు రాబట్టుకోవాలనుకుంటోంది. ప్రయివేటీకరణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 12 విమానాశ్రయాల జాబితాను రూపొందించింది. ఇందులో జైపూర్, ఇండోర్, కోల్ కతాతోపాటు విజయవాడ పేరు కూడా ఉంది. ఏపీకి ఉన్న ప్రధానమైన విమానాశ్రయం విజయవాడ. విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం వైమానిక దళానికి సంబంధించింది.

మెరుగైన సౌకర్యాల కల్పన కోసం..
భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో 146 విమానాశ్రయాలున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ సంఖ్యను 200కు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో మరిన్ని విమానాశ్రయాల ప్రయివేటీకరణ కొనసాగే అవకాశం కనపడుతోంది. దీనికి సంబంధించి 2023-24 బడ్జెట్ కీలకంగా మారింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం ప్రయివేటు పెట్టబడులను ఆకర్షించడం తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది.

రాజమండ్రి, తిరుపతి ఉంటాయా? ఉండవా?
ఏపీకి సంబంధించినంతవరకు ప్రధాన విమానాశ్రయం కావడంతో దీన్ని అభివృద్ధి పరచాల్సి ఉంది. 2021 డిసెంబరు 9వ తేదీన పౌర విమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్ లోక్ సభకు ఇచ్చిన సమాధానంలో మొత్తం 25 విమానాశ్రయాలను ప్రయివేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఉన్నాయి. వార్షిక ట్రాఫిక్ ను పరిశీలించిన తర్వాతే ఈ జాబితా రూపొందించినట్లు చెబుతున్నారు. తాజాగా ప్రవేశపెట్టే బడ్జెట్ లో రాజమండ్రి, తిరుపతి ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications