2018లో ఎపిపిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల వరద...చైర్మన్ పిన్నమనేని వెల్లడి...
అమరావతి: నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త...ప్రభుత్వ ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆశావాహులు ఈ వార్త తెలిసిన వెంటనే ముందు సంబరపడతారు. ఆ తరువాత సన్నద్దమవుతారు. ఇంతకీ విషయమేమిటంటే...2018 లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల కానున్నయట. ఈ విషయాన్నిఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ స్వయంగా తెలిపారు.
ఉద్యోగమంటే...నిరుద్యోగుల కల సాకారం...ఒక కల్పవృక్షం...కామధేనువు...అందులో ప్రభుత్వ ఉద్యోగమంటే ఇక ఆ లెక్కే వేరు. రాజకుమారుడు సింహాసనం అధిష్టించినట్లే...ఒక నిరుద్యోగి సర్కారు కొలువును సాధిస్తే అంతటి ఘనత సాధించినట్లు లోకం మెచ్చుకోలుగా చూస్తుంది. అంతేకాదు ఒక కుటుంబం కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుంది. ఎన్నో జీవితాలు నిలబడతాయి...మరెన్నో జీవితాలకు ఆలంబనగా నిలుస్తుంది. ఇలా
ఎంతయినా...ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. మరి అసలు ఉద్యోగాల భర్తీయే లేకపోతే... వీటన్నిటికీ అవకాశమే ఉండదు. కొంతకాలంగా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న నిరుద్యోగులకు ఎపిపిఎస్సీ చల్లని కబురు చెబుతోంది. ఇక మీ ముందు ఉద్యోగాల జాతరే నంటోంది.

నూతన నోటిఫికేషన్ల విడుదల...
వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ కోసం 2018లో కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ తెలిపారు. విజయవాడ బందర్రోడ్డులోని ఆర్అండ్బీ భవనంలో కేటాయించిన కొత్త కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన నియామకాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. త్వరలోనే వివిధ నియామకాలకు రివైజ్డ్ కేలండర్ విడుదల చేస్తామన్నారు.

కొత్త కార్యాలయం నుంచే...
గ్రూప్-2 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన జనవరి ఒకటి, రెండు వారాల్లో విజయవాడలోని ఎపిపిఎస్సీ నూతన కార్యాలయంలోనే జరుగుతుందని ఛైర్మన్ చెప్పారు. త్వరలోనే గ్రూప్-2 (2016) ఇంటర్వ్యూలు, జనవరి 22 నుంచి గ్రూప్-1(2011) ఇంటర్వ్యూలుకూడా ఇక్కడే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గ్రూప్-2, గ్రూప్-3లలో కామన్ అభ్యర్థులు ఉన్నందున తొలుత గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సందర్భంగా ఈ రెండు పోస్టులలో దేన్ని ఎంచుకుంటారో చెప్పాల్సిందిగా ఆప్షన్ కోరతామని ఉదయభాస్కర్ వివరించారు. దీనివల్ల డూప్లికేషన్ను నివారించగలుగుతామని, ఫలితంగా పోస్టులు మిగిలిపోకుండా ఉంటాయని, తదుపరి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

పొరపాటు జరిగితే...
ఆప్షన్లు,కేటగిరీల్లో పొరపాట్ల కారణంగా ఎవరికైనా అధిక మార్కులు వచ్చినా వారు సెలక్షన్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోవచ్చని, ఇలాంటి వారు తమకు జరిగిన అన్యాయాన్ని ఎపిపిఎస్సీ దృష్టికి తీసుకువస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది 34 నోటిఫికేషన్లు విడుదల చేయగా వాటిల్లో రెండు మూడింటిల్లో తప్ప అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. ప్రశ్నపత్రాల్లో అస్పష్టత, తప్పులు దొర్లటం సహజమన్నారు. అందుకే వాటిని గుర్తించి సవరించుకునేందుకు వీలుగా ‘కీ'లను కూడా విడుదల చేస్తున్నామని వివరించారు.

రిజర్వేషన్ల కోసం ప్రతిపాదనలు...
ఇప్పటివరకూ స్క్రీనింగ్ టెస్టులలో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, కానీ ఇందులోనూ కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో...ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదన పంపించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే స్ర్కీనింగ్ రాసిన అభ్యర్థుల నుంచి ఒక్కో పోస్టుకు 50మంది అభ్యర్థులను కేటగిరీవారీగా మెయిన్స్కు ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications