బాబుకు షాక్: రాజధానిగా విజయవాడ భద్రం కాదట!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ - గుంటూరు సురక్షితం కాదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడ భూకంపం జోన్లో ఉందని, అక్కడ భారీ నిర్మాణాలు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారట. గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతం భూప్రకంపన జోన్లో ఉందని హైదరాబాద్లోని భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థ (జీఎస్ఐ) స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని బాగుంటుందని అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.
నైరుతి గుణదల, మంగళగిరిలోని కొండ ప్రాంతాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని జూన్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఒక అంతస్థు భవనాలు నిర్మించడానికి కూడా ఈ ప్రాంతం అనువైనది కాదని చెప్పింది. ఇంద్రకీలాద్రి కొండల్లోని తూర్పు ఘాట్ ప్రాంతంతో పాటు నిడమర్రు నైరుతి ప్రాంతం, తాడేపల్లి తూర్పు వైపునున్న దక్షిణ ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో భూకంపాలు సంభవించే అవకాశముందని జీఎస్ఐ తెలిపింది.
విజయవాడకు 300 కిలో మీటర్ల రేడియస్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, భూకంపాలు ఎప్పుడు సంభవించే అవకాశం ఉందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. దాని తీవ్రతను కూడా ఇప్పుడు అంచనా వేయలేమని, భూకంపం వస్తే తప్ప దాని తీవ్రత గురించి వ్యాఖ్యానించలేమని వెల్లడిస్తున్నారు. భూకంపాలు వస్తాయని కేంద్రం గుర్తించిన 63 నగరాల జాబితాలో విజయవాడ మాత్రం ఉందంటున్నారు.
భూపొరల్లోని అసమతుల్యత, అపక్రమత కారణంగా సంభవించే మార్పుల వల్ల ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువని వారు తెలిపారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం కావడంతో ఇక్కడి భూమిలో నాణ్యత కూడా తక్కువని, అయితే పంటలు పండించేందుకు బ్రహ్మాండంగా పనికి వస్తుందంటున్నారు.