విజయవాడ దెబ్బకు కృష్ణాజిల్లా బెంబేలు.. కూరగాయల రవాణాకు బ్రేక్- మరిన్ని ఆంక్షలు..
ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న జిల్లాలో కృష్ణాజిల్లా కూడా ఒకటి. అందులోనూ విజయవాడలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 250కి చేరువలో ఉంది. అందులో కేవలం ఒక్క విజయవాడలోనే వందకు పైగా కేసులున్నాయి. దాదాపు విజయవాడ నగరమంతా రెడ్ జోన్ లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి నిత్యావసరాల రవాణా ద్వారానే కృష్ణాజిల్లాలోని ఇతర ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నగరంలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్లో తాజాగా హమాలీలకు కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లిన వ్యాపారులంతా ఇప్పటికే లబోదిబోమంటున్నారు. నూజివీడుతో పాటు బందరు నుంచి వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లిన వ్యాపారులు ఎవరెవరికి వాటిని అమ్మారో అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నారు. వీరి లెక్క ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.
దీంతో కనీసం ఇప్పటికైనా వీటి రవాణాను ఆపాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. తొలుత జిల్లా కేంద్రమైన బందరుకు విజయవాడ నుంచి కూరగాయల రవాణాను నిలిపివేశారు. విజయవాడకు బదులుగా ఏలూరు, అవనిగడ్డ నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోనున్నారు.
Recommended Video
జిల్లాలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి మరిన్ని ఆంక్షలు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. పేదలకు దాతలు పంపిణీ చేస్తున్న ఫుడ్ ప్యాకెట్లు, నిత్యావసరాలు, కూరగాయల పంపిణీని నిలిపేయనున్నారు. కేవలం చికెన్, మటన్ విక్రయాలకు మాత్రమే అనుమతించనున్నారు. చేపలు, రొయ్యలతో పాటు అన్ని ఆక్వా ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధిస్తారు. నిత్యావసరాలను అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.