మోసం: 'చచ్చిన' మనిషి పోలీసు ట్రాప్లో పడ్డాడు

డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పోలీసుల వంటి బడా బడా వ్యక్తులను అతను మోసం చేశాడు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన వంశీకృష్ణ రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాల్లో కోట్లాది రూపాయలు మోసం చేశాడు. బాధితుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో రెండేళ్ల క్రితం మాయమయ్యాడు. ప్రమాదంలో మరణించినట్లు నాటకమాడాడు.
నార్ల వంశీకృష్ణ మాయమైన తర్వాత విజయవాడలోని సత్యనారాయణపురం, మాచవరం, వన్ టౌన్, పటమటల్లో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. వంశీకృష్ణను అదుపులోకీ తీసుకున్న సూర్యారావుపేట పోలీసులు అతన్ని విచారించారు. గత రెండేళ్లుగా వంశీకృష్ణ ఇతర రాష్ట్రాల్లోనూ, సింగపూర్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
వంశీకృష్ణ 70 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఓ కారులో వెళ్తూ రెండేళ్ల క్రితం దుగ్గిరాల వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం నుంచి అతని తల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, వంశీకృష్ణ జాడ మాత్రం తెలియలేదు. అతని మృతదేహం కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించారు.
అయితే, వంశీకృష్ణ మరణించాడనే విషయాన్ని బాధితులు నమ్మలేదు. అతని బంధువులపై, స్నేహితులపై నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి పుష్ప హోటల్ సెంటర్లోని నివాసంలో తన అనుచరుడిని కలవడానికి వచ్చిన వంశీకృష్ణను బాధితులు గుర్తించారు. వంశీకృష్ణ పలు కేసుల్లో నిందితుడు.












Click it and Unblock the Notifications