విజయవాడ దుబాయ్ విమానం.. కేంద్రమంత్రి చేతుల్లో నిర్ణయం!
2017లో విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. అప్పటినుండి విజయవాడ నుంచి దుబాయ్ కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రజల నుండి అనేక విజ్ఞాపనలు వచ్చాయి. దుబాయ్ సర్వీసులకు అధిక డిమాండ్ ఉంటుందని అధికారులు నిర్వహించిన సర్వేలో కూడా తేలింది. ఈ సర్వేలో 2.5 లక్షల మందికి పైగా ప్రజలు దుబాయ్ సర్వీసులను నడిపితే బాగుంటుందని తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
మళ్ళీ చిగురిస్తున్న దుబాయ్ విమాన ఆశలు
ఇప్పటివరకు విజయవాడ విమానాశ్రయంలో ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో విమానాశ్రయాల అభివృద్ధి పెద్దగా జరగలేదని చెప్పాలి. గత ప్రభుత్వం సింగపూర్ సర్వీసును నిలిపి వేయడంతో పాటు, దుబాయ్ సర్వీస్ పైన ఆశలను కూడా గంగలో కలిపేసింది. అయితే ప్రస్తుతం మళ్ళీ విజయవాడ వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

దుబాయ్ సర్వీసులతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష అనుసంధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న క్రమంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపైన కూడా దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ నుండి దుబాయ్ కు విమాన సర్వీసులు ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుంది అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంతర్జాతీయ నగరాలకు చేరటం ఈజీ
దుబాయ్ కి విమానాలు ప్రారంభమైతే అమెరికాలోని న్యూయార్క్, న్యూ జెర్సీ నగరాలతో పాటు లండన్, పారిస్, ఆస్ట్రేలియా, చైనా వంటి ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంగళ, శనివారాలలో షార్జా కు ఒకే ఒక సర్వీస్ నడుస్తోంది. నవంబర్ 15వ తేదీ నుంచి మంగళ, గురు, శని వారాలలో సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయానికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
దుబాయ్ కి సర్వీస్.. గతంలో ప్రయత్నించిన చంద్రబాబు
ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ విమాన సర్వీసుల పైన కూడా ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. విజయవాడ నుండి దుబాయ్ కి విమాన సర్వీసును వయబులిటి గ్యాప్ ఫండింగ్ విధానంలో 2019 జనవరిలోనే ప్రారంభించడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుబాయ్ కు సర్వీస్ లను నడపడానికి చంద్రబాబు హయాంలో విమానయాన సంస్థల నుంచి బిడ్ లను కూడా ఆహ్వానించారు.
మంత్రి రామ్మోహన్ నాయుడుకు దుబాయ్ ఫ్లైట్ కోసం విజ్ఞప్తి
తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థని ఎంపిక చేసి సర్వీసులు ప్రారంభించారని అప్పట్లో భావించారు. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం రావడంతో అది కాస్త పడకేసింది. ప్రస్తుతం మళ్ళీ ఏపీలో ఏవియేషన్ మినిస్టర్ మంత్రి రామ్మోహన్ నాయుడు దూకుడుతో మరోమారు ప్రజల నుండి విజ్ఞాపనలు వెల్లువగా మారాయి.












Click it and Unblock the Notifications