బాబు ప్రకటన: జగన్ ఒత్తిడి, టీలో పవన్ కళ్యాణ్ టార్గెట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం శాసన సభలో ప్రకటన చేయనున్నారు. రాజధాని పైన మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు రాజధానిగా ఏది చెబుతారో తెలిసినప్పటికీ ఉత్కంఠ మాత్రం ఉందనే చెప్పవచ్చు. రాజధాని పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిలదీత నేపథ్యంలో ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.
విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా.. అనువైన ప్రాంతంలో ఉండాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి చెందిన చోట రాజధాని ఎందుకని వైయస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. రియాల్టర్లకు, సొంత వారికి లాభం చెందేలా కాకుండా రాష్ట్రం కోసం రాజధానిని ఏర్పాటు చేయాలని హితవు పలికారు. చంద్రబాబు రాజధాని ప్రకటన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం ఏం చేయాలనే దాని పైన వ్యూహాలు రచిస్తోంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయి రేపు చంద్రబాబు రాజధాని పైన ప్రకటన చేసే సమయంలో ఏం చేయాలనే దాని పైన చర్చించారు. రాజధాని పైన చర్చ, ఓటింగ్కు పట్టుబట్టాలని, అధికార పక్షం ఓటింగ్కు సరేనని చెప్పే వరకు ఒత్తిడి తేవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది.
జగన్ నివాసంలో జరిగిన భేటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రోజా, అమర్నాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాజధాని ప్రకటనకు ముందే చర్చ జరగాలని, ఓటింగ్ జరపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, అధికార పక్షం మాత్రం రాజధాని ప్రకటనకు సిద్ధమవుతోంది. దీంతో రేపు శాసన సభలో ఏం జరగనుందని అందరు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
మరోవైపు, తెలంగాణలో ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. బరిలో కాంగ్రెస్, బీజేపీ, తెరాస అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిల మధ్యనే ఉన్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. జగ్గారెడ్డికి టిక్కెట్ రావడం వెనుక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో తెరాస పవర్ స్టార్ను కూడా ఏకిపారేస్తోంది.
బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైన తెరాస విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ బీజేపీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. జగ్గారెడ్డి సమైక్యవాది అని మండిపడుతున్నారు. మరోవైపు, బీజేపీ అందుకు ధీటుగానే సమాధానం చెబుతోంది.
జగ్గారెడ్డి పక్కా తెలంగాణవాది అని, ఆయన సమైక్యవాది అయితే గతంలో తెరాస టిక్కెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణవాదుల పైన రాళ్లేసిన కొండా సురేఖ, నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మహేందర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications