YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఈ నెల 13న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ మేమంతా సిద్దం యాత్ర సందర్భంగా రాయితో దాడి జరిగింది. ఈ దాడికి కారకుల్ని కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. ఇవాళ ఎట్టకేలకు వారిని అరెస్టు చేశారు. దాడికి వీరిద్దరే కారణమని నిర్దారణకు వచ్చిన పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించబోతున్నారు.

సీఎం జగన్ పై అజిత్ సింగ్ నగర్ డాబాకొట్లు సెంటర్ సమీపంలోని ఓ స్కూల్ వద్ద రాయి దాడి జరిగింది. ఈ ఘటనకు కారకుడిగా సతీష్ అనే యువకుడిని గుర్తించారు. అలాగే అతనికి వేముల దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసులు నిర్దారింంచారు. వేముల దుర్గారావు స్ధానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుడు కూడా. దీంతో సతీష్, దుర్గారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
ఇప్పటికే సీఎంపై దాడి జరిగిన రోజు ఏం జరిగిందో సతీష్ తల్లి మీడియాకు వెల్లడించారు. జగన్ యాత్రలో బిర్యానీ, డబ్బులు ఇస్తామని చెప్పి తమ పిల్లల్ని తీసుకెళ్లారని, కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో వారు రాయి విసిరి ఉండొచ్చన్నారు. దీంతో ఇప్పుడు ఈ కోణంలోనే సతీష్, దుర్గారావుపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దాడికి సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలు ఏవీ లేకపోవడంతో కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications