బెజవాడ పోలీసుల నేస్తం ఇక లేదు- అనారోగ్యంతో డాగ్ రాజా మృతి...అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఏదైనా నేరం జరిగినప్పుడు దాని దర్యాప్తులో ఆధారాలు సంపాదించడం పోలీసు అధికారులకు అత్యంత కీలకం. కేసు దర్యాప్తును, అంతిమ ఫలితాన్ని ప్రభావితం చేసేవి ఇవే. ఆధారాల అన్వేషణలో పోలీసులకు క్లూ టీమ్స్ తో పాటు కుక్కలు కూడా విశేషంగా సాయం చేస్తుంటాయి. వాసన చూస్తే చాలు ఆధారాన్ని కచ్చితంగా కనిపెట్టగల పోలీసు కుక్కలు ఇప్పుడు పలు క్లిష్టమైన కేసుల దర్యాప్తులను సులువుగా పూర్తి చేసేందుకు తగిన సాయం చేస్తున్నాయి. ఇదే కోవలో విజయవాడలో ఆరేళ్లుగా పోలీసులకు అనేక కీలక కేసుల దర్యాప్తులో తన వంతు సాయం అందించిన శునకరాజం రాజా అనారోగ్యంతో చనిపోయింది.
విజయవాడ పోలీసుల నేస్తం ఇక లేదు...
విజయవాడ కమిషనరేట్ పరిధిలో గత దశాబ్ద కాలంలో జరిగిన ఎన్నో నేరాల పరిశోధనలో కీలక పాత్ర పోషించిన పోలీస్ డాగ్ రాజా ఇక లేదు. అనారోగ్యంతో బాధపడుతూ రాజా చనిపోయింది. వివిధ కేసుల దర్యాప్తులో పోలీసులకు ఎంతో సాయం అందించిన రాజా ఇక లేదనే వార్త పోలీసు వర్గాలను షాక్ కు గురి చేసింది. జిల్లాలో జరిగిన ఎన్నో క్రిమినల్ కేసుల్లో నేరగాళ్లను పట్టించడంలో విశేషంగా సేవలందించిన రాజా లేదని తెలియగానే.. పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో పాటు డీఎస్పీలు, డీసీపీలు, ఏసీపీలు రాజాను చివరి సారిగా చూసేందుకు విజయవాడ వచ్చారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు...
విజయవాడకు చెందిన పోలీస్ డాగ్ రాజా చనిపోయిందన్న వార్త తెలుసుకున్న అధికారులు.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో వందనం చేసి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు వాహనంలో ఊరేగించి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాతో ఉన్న అనుబంధాన్ని పలువురు పోలీసు అధికారులు గుర్తు చేసుకున్నారు.
విశేష సేవలతో పతకాల పంట....
పోలీసు శాఖకు గత ఆరేళ్లుగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాజాను పలు విశిష్ట పతకాలు వరించాయి. ఇందులో పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్దాయి పతకాలు కూడా ఉన్నాయి. ఆరేళ్ల వయసులో మొత్తం 16 పతకాలను రాజా సొంతం చేసుకుంది. హర్యానాలో తాజాగా జాతీయ స్దాయి పతకాన్ని కూడా రాజా అందుకోవడం విశేషం. ఆయా పతకాల సాధనలో రాజాతో పాటు ఉన్న పోలీసు అధికారులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.