జగన్ పాదయాత్ర, విజయవాడ పోలీసులపై తప్పుడు ప్రచారం: ఇద్దరిపై కేసుకు రంగం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తున్న వాహనచోదకులపై విజయవాడ పోలీసుల దౌర్జన్యం అంటూ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో తప్పుడు వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరు పేస్బుక్ పేజీ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు రంగం సిద్ధం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనను విజయవాడ పోలీసులకు ఆపాదిస్తూ తప్పుడు వీడియోను పోస్టు చేశారు. దీనిపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఆ వీడియో ఏపీకి సంబంధించినది కాదని గుర్తించారు.
దీంతో విజయవాడ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ పోస్టులను విజయవాడ నగరంలో రెండు ప్రాంతాల నుంచి నిక్షిప్తం చేసినట్లు గుర్తించారు. సూర్యారావుపేట, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కృష్ణా జిల్లాలో రెండో రోజు (ఆదివారం) ప్రారంభమైంది. విజయవాడ శివారు వైయస్సార్ కాలనీ నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. మైలవరం, గన్నవరం నియోజకవర్గాలలోని వివిధ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామాల్లో జగన్కు కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది.