కిడ్నాప్ కేసు: శభాష్, బెజవాడ ఏసీపీ శ్రీనివాస్ భుజంతట్టి ప్రశంసించిన కామినేని
అమరావతి: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు 36 గంట్లలో ఛేదించారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కిడ్నాప్ అయిన పసికందును అవనిగడ్డలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పసికందుని తల్లిదండ్రులకు అప్పగించిన సంగతి తెలిసిందే.
కిడ్నాప్ కథ సుఖాంతం: పేరంట్స్ వద్దకు పసికందు, అవనిగడ్డలో కిడ్నాపర్లు అరెస్ట్
ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పసికందును కిడ్నాప్ చేసిన వారిని శిక్షిస్తామని పేర్కొన్నారు. తల్లి ఒడికి చేరిన పసికందు ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు. త్వరలోనే ప్రభుత్వాసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కిడ్నాప్ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం ఉంటే వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. పసికందుని తల్లిదండ్రులు వద్దకు చేర్చడంలో కృషి చేసిన పోలీసులను ఆయన అభినందించారు.
అసలేం జరిగింది, ఎవరా మహిళ?: బెజవాడ పసికందు కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
విజయవాడ ఏసీపీ శ్రీనివాస్ సహా కిడ్నాప్కు గురైన బాబు గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసులని మీడియా ముందు భుజం తట్టి ఆయన ప్రశంసించారు. ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాలని, అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి రాద్దాంతం చేసే నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు కిడ్నాప్ ఘటనపై విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ శిశువు కిడ్నాప్ కేసులో అనేక ఆరోపణలు వస్తున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. డబ్బులకు బాబును అమ్మారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రజలు తమకు పూర్తిగా సహకరించారని అన్నారు.