విజయవాడ రైల్వే స్టేషన్ ఫర్ సేల్ : లిస్టులో రైల్వే కాలనీ సైతం : ఇక జరిగేది ఇదేనా..!!
విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ ఇక పూర్తిగా ప్రయివేటు వ్యక్తల చేతుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు రంగం సిద్దం అవుతోంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం బెజవాడ నడి బొడ్డున ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ ను కమర్షియల్ గా మార్చాలని భావిస్తోంది. మరో వైపు కేంద్రం ఇప్పటికే తీసుకున్న మానిటైజేషన్ నిర్ణయం లో విజయవాడ రైల్వే స్టేషన్ సైతం ఆ జాబితాలో చేరింది. దాదాపు ఆరు లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన ఈ మానిటైజేషన్ విధానంలో విజయవాడ రైల్వే స్టేషన్ ను చేర్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్ గా నిలిచింది.
దేశంలోనే రెండో పెద్ద రైల్వే జంక్షన్ గా..
ఏ1 రైల్వేస్టేషన్ గా చెప్పుకొనే ఈ స్టేషన్ ఇక ప్రయివేటు వ్యక్తులే నిర్వహించనున్నారు. గతంలోనే ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచినా..స్పందన లేదు. రైల్వే స్టేషన్ తో పాటుగా సత్యనారాయణపురం రైల్వే కాలనీ, గూడ్స్ షెడ్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడ డివిజన్లోని రైల్వే కార్మికులు ఎక్కడికక్కడ మెరుపు ఆందోళనలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గూడ్స్ షెడ్లను గోడౌన్లుగా ఉపయోగించుకోవచ్చునని ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది.
చిన్న షెడ్ లో ఆరంభమై...అతి పెద్ద స్టేషన్ గా
1888 లో ప్రారంభమైన విజయవాడ రైల్వే స్టేషన్ తొలుత మద్రాస్ దక్షిణ మహారత్తన్ (ఎంఎస్ఎం) స్వతంత్ర రైల్వేగా ఉండేది. ఆ రైల్వే ప్రధాన తూర్పు మార్గాన్ని విజయవాడ వెళ్లే మార్గాలతో అనుసంధానించేలా రైల్వేస్టేషన్ను నిర్మించారు. నిజాం హయాంలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్ల మధ్య ఎక్స్టెన్షన్ లైన్ను నిర్మించారు. ఈ లైన్ ద్వారా విజయవాడ రైల్వే జంక్షన్గా మారింది. కొంత కాలానికి విజయవాడ, చెన్నైల మధ్య బ్రాడ్గేజ్ లైన్ను నిర్మించారు. చెన్నై నుంచి ముంబయి, హౌరా, ఢిల్లీ, హైదరాబాద్ల మధ్య రైలు ప్రయాణం సాధ్యమైంది.
ఉత్తరం-దక్షణ రాష్ట్రాలను కలుపుతూ
తరువాత భారత ప్రభుత్వం అన్ని స్వతంత్ర రైల్వేలను జాతీయం చేసింది. అప్పుడే మద్రాస్ దక్షిణ మహరత్తన్ కూడా దక్షిణ రైల్వేలో అంతర్భాగమైంది. విజయవాడ రైల్వేస్టేషన్ను దక్షిణ రైల్వేకు కేటాయించారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ డివిజన్ భాగమైంది. ఇక, ఇప్పుడు దక్షిణ-ఉత్తరాది రాష్ట్రాలను కలిపే స్టేషన్ గా పేరు సంపాదించింది. నిత్యం ఇక్కడ నుంచి వందలాది రైళ్లు..లక్షలాది మంది ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తూ ఉంటారు. ఈ స్టేషన్ ఇప్పటికే లాభాల బాటలోనే ఉంది.
రైల్వే కాలనీ సైతం అమ్మకానికి
అయితే, కేంద్రం తీసుకున్న విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. చిన్న పాటి షెడ్ తో ప్రారంభమైన విజయవాడ రైల్వే స్టేషన్ ఈ రోజున 10 ప్లాట్ఫామ్లతో దేశంలోనే బిజీ జంక్షన్గా పేరుగాంచింది. ప్రతి రోజూ 80 డైలీ ఎక్స్ప్రెస్లు, 47 నాన్ డెయిలీ ఎక్స్ప్రెస్లు, 133 డైలీ పాసింజర్, 11 నాన్ డైలీ పాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మొత్తం 275 పాసింజర్ రైళ్లు, 175 సరుకు రవాణా రైళ్లు విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే స్టేషన్ .. రైల్వే ఆస్తులను మానిటైజేషన్ పేరుతో ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించటం ఒక ఎత్తైతే.. రైల్వే ఉద్యోగులు నివసించే రైల్వే కాలనీ సైతం అందులో చేర్చటం కార్మికులకు రుచించటం లేదు.
లాభాల్లో ఉన్నా ప్రయివేటు వ్యక్తులకు..కార్మికుల ఆందోళన
సత్యనారాయణ పురం రైల్వే కాలనీలో దాదాపు వెయ్యిమంది రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ నివాసాలకు ఆనుకుని మరో మూడెకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటినీ రైల్వేబోర్డు ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో పిలిచిన ప్రైవేటు టెండర్లకు ఎవరూ ఆసక్తి కనిపించలేదు. మానిటైజేషన్ పేరుతో అనధికారికంగా అమ్మకం అనే విధంగా సాగుతున్న ప్రచారం లో భాగంగా ఈ స్టేషన్ ను ఎంత మొత్తంలో ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రయివేటీకరిస్తామని చెబుతున్న ప్రభుత్వం...ఇప్పుడు లాభాల్లో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ లాంటి వాటిని సైతం మానిటైజేషన పేరుతో ప్రయివేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాల పైన కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.