వెటర్నరీ ఆసుపత్రి భవంతికి ఎన్టీఆర్, గ్రౌండ్ ఫ్లోర్కు హరికృష్ణ పేరు
అమరావతి: విజయవాడలోని లబ్బీపేట వద్ద నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మరో నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ. 3.08 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్కు మాజీ ఎంపీ, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఆసుపత్రి మొత్తం భవంతికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని, కేవలం గ్రౌండ్ ఫ్లోర్కు మాత్రం హరికృష్ణ బ్లాక్గా నామకరణం చేయాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పశుగణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ఈ భవన నిర్మాణానికి కొంత మేర నిధులిచ్చారు.
ఆ తర్వాత నిధులలేమితో మధ్యలోనే పనులు ఆగిపోయాయి. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ చొరవతో రాజ్యసభ ఎంపీగా ఉన్న నందమూరి హరికృష్ణ కలిసి ఎంపీ లాడ్స్ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. దీంతో హరికృష్ణ ఈ భవంతి కోసం ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 1.70 కోట్లను విడుదల చేశారు.
దీంతో ఈ భవంతికి ఆయన పేరు పెడదామని ఆలోచించారు. అయితే ఇప్పడుు తాజాగా ఈ భవంతికి నందమూరి తారకరామరావు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు.
అప్పట్లో నగర సీపీగా ఉన్న సురేంద్రబాబు పశువుల ఆసుపత్రిని నిర్మించిన స్థలాన్ని పోలీసు పేరెడ్ గ్రౌండ్ కోసం కావాలని దరఖాస్తు చేసి జీవో తెప్పించారు. అయితే దీనిపై రైతులు, పశు సంవర్ధకులు ఆందోళన చేయడంతో అప్పటి సీఎం పోలీసుల కోసం ఇచ్చిన జీవోను రద్దు చేసి పశు సంవర్ధక శాఖకే అప్పగించారు.
మరో నెల రోజుల్లో ఈ సూపర్ స్పెషాలిటీ పశువుల ఆస్పత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడి దామోదరనాయుడు మంగళవారం మీడియాతో చెప్పారు. ఇదే భవనంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకుడి కార్యాలయంతోపాటు ఆసుపత్రి కూడా ఉంటుందని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరో రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడే ఆధునిక పశువ్యాధుల నిర్ధారణ పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.