రాజ్యసభ ఛైర్మన్ గా విజయ సాయిరెడ్డి - వెంకయ్య స్థానంలో..!!
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత..రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్థానంలో సాయిరెడ్డి సభను నిర్వహించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఉపరాష్ట్రపతికి ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ నుంచి ధన్ కర్.. విపక్షాల నుంచి మార్గరేట్ అల్వా ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతి గా గెలిచిన వారు రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు.

ఛైర్మన్ స్థానంలో విజయ సాయిరెడ్డి
దీంతో..వెంకయ్య నాయుడు కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు కొత్త ప్యానెల్ స్పీకర్లను ప్రకటించారు. అందులో వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్న విజయ సాయిరెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో..ఈ రోజు సాయిరెడ్డి ఛైర్మన్ స్థానంలో తొలి సారి ఆశీనులై సభను నడిపించారు. తొలి సారిగా ఛైర్మన్ స్థానంలోకి వచ్చిన విజయ సాయిరెడ్డికి సభ్యులు స్వాగతం పలికారు. ఆ వెంటనే సాయిరెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా సూచించారు. మంత్రి సమాధానంకు ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సభ్యురాలిని అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు సాయిరెడ్డి అవకాశం ఇచ్చారు.

ప్రతిపక్షాల నిరసనల మధ్యనే
ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధిక ధరలను నిరిసిస్తూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పదవీ విరమణ చేస్తుండటంో..ఆయనకు తిరిగి ఛైర్మన్ హోదాలో కొనసాగే అవకాశం ఉండదు. కానీ, ప్యానెల్ స్పీకర్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయ సాయిరెడ్డికి అవకాశం దక్కనుంది. అటు లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అవినాశ్ రెడ్డిని స్పీకర్ ప్యానెల్ స్పీకర్ గా నియమించారు. దీంతో..అవినాశ్ గత సమావేశాల్లో స్పీకర్ స్థానంలో సభను నిర్వహించారు.
వైసీపీ - కేంద్రం సంబంధాల్లో కీలకంగా
గతంలో ఉమ్మడి ఏపీ నుంచి టీడీపీ ఎంపీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా సాయిరెడ్డికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అనేక అంశాల్లో చర్చలతో పాటుగా ప్రశ్నలు వేయటంలో ఆయన తొలి వరుసలో ఉన్నారు. సభకు హాజరు విషయంలోనూ ఆయన ముందంజలో నిలిచారు. వైసీపీ నుంచి కేంద్రంతో సంప్రదింపులు.. రాష్ట్ర వ్యవహారాల పైన ఏపీ అధికార ప్రతినిధి హోదాలో సాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు సాయిరెడ్డి ఫ్యానల్ ఛైర్మన్ గా సభ నిర్వహణ అంశం వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది.












Click it and Unblock the Notifications