జగన్ నిర్ణయం - బీజేపీ ప్రభుత్వం అమలు : కర్ణాటకలోనూ అమలు ఆరంభం..!!
ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక వార్డు సచివాలయ వ్యవస్థ. ఎన్నికల ముందే పాదయాత్ర సమయం నుంచి వార్డు - గ్రామ సచివాలయాల ఏర్పాటు.. వాటి ప్రయోజనాల గురించి జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని అమల్లోకి తీసుకొచ్చారు. వీటి ద్వారానే స్థానికంగా గ్రామాల్లో.. సంబంధిత వార్డుల్లో ప్రభుత్వ సేవలు అందే విధంగా ఏర్పాట్లు చేసారు. వీటిల్లో పని చేసేందుకు పలువురి కి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని..అర్హత ఉన్న వారికి ఈ జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్ ప్రకటించి.. ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయనున్నారు.
ఇక, ప్రతీ సచివాలయం నుంచి ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించారు. ఈ విధానం పైన పలు రాష్ట్రాలు ఆసక్తి చూపించాయి. ఇక్కడ అమలు చేస్తున్న విధానం గురించి ఆరా తీసాయి. ఇక, ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం తాజాగా 'గ్రామ వన్ సేవా కేంద్రాలు' ఏర్పాటు చేసింది. వీటిద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు, ధ్రువీకరణ పత్రాలను ఒకేచోట ప్రజలకు అందజేస్తున్నారు. కర్ణాటకలోని 12 జిల్లాల్లో 3,024 పంచాయతీల్లో ఈ గ్రామ వన్ సేవా కేంద్రాలు సేవలందిస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఈ రకమైన సేవలు అందించేందుకు వీలుగా గ్రామ వన్ సేవా కేంద్రాలు' అమలు నిర్ణయానికి రంగం సిద్దమైంది. ఈ కేంద్రాలను పూర్తిగా సాంకేతికంగా ప్రభుత్వం డెవలప్ చేస్తోంది. సాధారణ ప్రజలకు అవసరమయ్యే బ్యాంకింగ్ సేవలు, ఆధార్ కార్డు, ఆయుష్మాన్ కార్డు, ఏపీఎల్, బీపీఎల్ కార్డు తదితర 100 సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. ఇవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి.
దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్థితిగతులను తెలుసుకునేందుకు మొబైల్ నంబర్కు ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నారు. వీటితో పాటుగా.. ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రాల ద్వారానే ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఇప్పటికే గ్రామ సచివాయల్లో మరో 14 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు, ఈ తరహా విధానమే కర్ణాటకలోనూ అమలు చేయటం పైన రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది.