గ్రామ సచివాలయాలపై టీడీపీ రగడ.. అయినా ఏపీ ప్రభుత్వం ముందుకు..
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల భవనాలు తుది రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకవంక గ్రామ సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల విధానంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతుండగా.. మరో వంక రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రభుత్వం. వచ్చేనెల 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు తమ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆరంభించాల్సి ఉన్నందున.. పనుల కొనసాగింపుపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే జిల్లాలవారీగా గ్రామ సచివాలయాల పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ను రూపొందిస్తోంది. త్వరలోనే ఈ జాబితాను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకుని రాబోతోంది.
అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఓ యూనిట్ గా..
రాష్ట్రంలో ప్రస్తుతం 12 వేలకుపైగా పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక్కో యూనిట్ గా తీసుకుని గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నారు అధికారులు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పంచాయతీ కార్యాలయాలను ప్రాతిపదికగా తీసుకుని గ్రామ సచివాలయాల సంఖ్యను నిర్ధారించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల అధికారులు వాటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులు, మంత్రులకు దీనికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. గ్రామ సచివాలయాల నిర్మాణానికి అవసరమైన నిధులను ఆయా శాఖల నుంచే కేటాయించారు. మరి కొంత మొత్తాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పంచాయతీ కార్యాలయాలకు తుది మెరుగులు దిద్దారు. పంచాయతీ రాజ్ కార్యాలయాలు బలహీనంగా ఉన్న గ్రామాల్లో కొత్త భవనాలను నిర్మించారు.
ఒకేసారి 22 మంది కూర్చునేలా..
గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు కాకుండా.. ఒకేసారి 25 మంది సందర్శకులు కూర్చునేలా వాటిని నిర్మిస్తున్నారు. సుమారు 200లకు పైగా పనులను ఒక్క గ్రామ సచివాలయం నుంచే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఏ ఒక్కరు కూడా తమ పాలనాపరమైన పనుల కోసం ఏ ప్రభుత్వ కార్యలయం గడప తొక్కకుండా అన్నింటినీ గ్రామ సచివాలయాల రూపంలో సమీకృతం చేసింది. ఫలితంగా సందర్శకుల తాకిడి అధికంగా ఉండొచ్చని అధికారులు ముందే ఓ అంచనాకు వచ్చారు. దీనికి అనుగుణంగా భవనాలను నిర్మిస్తున్నారు.ఒక్క భవనం విస్తీర్ణం తప్పనిసరిగా 2000 చదరపు అడుగులు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ.. చాలాచోట్ల ఆ ప్రమాణాల కంటే తక్కువ విస్తీర్ణంలోనే నిర్మితం అయ్యాయి. స్థలాభావమే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
వైసీపీ జెండా రంగులపై నిరసన
గ్రామ సచివాలయ కార్యాలయాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని ముదురు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులను వేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పరమైన కార్యకలాపాలను కొనసాగించడానికి వీలుగా నిర్మించుకున్న గ్రామ సచివాలయాలపై ఓ పార్టీ ముద్ర వేయడం సరికాదంటూ తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు విమర్శించాయి. ప్రతి గ్రామ సచివాలయానికీ వైసీపీ జెండా రంగులను వేయడం తప్పనిసరి చేస్తూ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్ పట్ల ఆయా పార్టీల నాయకులు ఇదివరకే ఓ సారి విమర్శలు చేశారు. గడువు సమీపిస్తున్న కొద్దీ తమ విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. నిధుల వినియోగం, వాటి అంచనాలు, నిర్మాణ పనుల్లో నాణ్యత, అందులో అవినీతి చోటు చేసుకుందనే అంశాలను ప్రధానంగా ఎత్తి చూపుతూ.. అక్టోబర్ 2వ తేదీ నాడే ధర్నాలు, నిరసన ప్రదర్శనలను చేపట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.