ఏపీ పంచాయతీ ఎన్నికలు... సర్పంచ్ పోటీకి సిద్దమైన మహిళా వాలంటీర్...
ఎస్ఈసీ నిమ్మగడ్డతో నెలకొన్న వైరం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఏకగ్రీవాలు కుదరని చోట బలమైన అభ్యర్థులకు మద్దతు తెలుపుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లిలో ఏకంగా గ్రామ వాలంటీర్ సత్యవతిని సర్పంచ్ పోటీకి వైసీపీ రంగంలోకి దించింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ తరుపున ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
గ్రామ ప్రజలందరితో సత్యవతికి సత్సంబంధాలు ఉన్నాయి. గ్రామ వాలంటీర్గా అందరిచేత భేష్ అనిపించుకున్న ఆమె... ఉత్తమ వాలంటీర్ అవార్డును కూడా అందుకున్నారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో ఆమె చూపించే శ్రద్దను స్థానికులు కొనియాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే సత్యవతిని సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచినట్లు తెలుస్తోంది. మొదట సత్యవతిని పిలిపించి దీనిపై చర్చించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. అందుకు ఆమె ఒప్పుకోవడంతో వైసీపీ తరుపున మద్దతు ప్రకటించారు.

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... ప్రసన్నాయపల్లి గ్రామానికి చెందిన కురుబ సత్యవతి వాలంటీర్గా అందరి మన్ననలు పొందిందన్నారు. అందుకే అధికారులు సత్యవతికి బెస్ట్ వాలంటీర్ అవార్డు కూడా ఇచ్చారన్నారు. గ్రామ సచివాలయం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆమె చాలా చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. డిగ్రీ పూర్తి చేసిన సత్యవతికి వాలంటీర్గా ఉన్న అనుభవం సర్పంచ్ పదవికి తోడ్పడుతుందన్నారు. గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉన్న ఆమె సర్పంచ్గా గెలిస్తే గ్రామం అభివృద్ది చెందుతుందన్నారు.
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. . ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై అభ్యంతరాలను పరిశీలన, ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
తొలి విడతలో మొత్తం 12 జిల్లాల్లో దాదాపు 175 మండలాల్లోని 3,249 పంచాయతీలకు, వాటి పరిధిలోని 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకూ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7గంటల లోపు ఫలితాలను వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications