లాక్ డౌన్ వేళ.. మద్యం విక్రయాలు.. ఏపీలో గ్రామ వాలంటీర్ అరెస్ట్..
లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిబంధనలు బేఖాతరు చేస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ గ్రామ వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ పేట గ్రామ వాలంటీర్ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొద్దిరోజులుగా అతని నిఘా పెట్టారు.తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. శుక్రవారం(ఏప్రిల్ 17) అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ గ్రామ వాలంటీర్ల సేవలు కీలకంగా మారాయి. వాలంటీర్లే గ్రామ ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ యాక్టివ్గా ఉండటం వల్లే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు.ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 572కి పెరిగింది. ఇప్పటివరకు 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 523 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

జిల్లాలవారీగా చూస్తే.. ఇప్పటివరకు కర్నూలులో, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 126 చొప్పున కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురు,కర్నూలులో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరులో 64 మందికి పాజిటివ్గా నిర్దారణ కాగా.. ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఒకరు డిశ్చార్జి అయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications