వినాయకచవితి వేడుకల రగడ .. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి విశాఖలో హిందూ సంఘాల మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై రగడ కొనసాగుతూనే ఉంది. బహిరంగ ప్రదేశాలలో వినాయక చవితి ఉత్సవాలను రద్దుచేస్తూ, ప్రజలు ఇళ్లలోనే వినాయక చవితి ఉత్సవాలను చేసుకోవాలని, పూజ సామగ్రి కొనుగోలు చేసే దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలని, కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో బహిరంగ వేదికలపై వినాయక చవితి వేడుకలను రద్దు చేస్తున్నామని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇదే సమయంలో హిందూ సంఘాలు జగన్ సర్కారు తీరుపై విరుచుకు పడుతున్నాయి.
జగన్ హిందూ వ్యతిరేకి అంటూ రచ్చ ; ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలతో జగన్ కు బూమరాంగ్
జగన్ టార్గెట్ గా వినాయక చవితి వేడుకలపై రచ్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళు కొనసాగుతున్నాయని, బార్లు బార్లా తెరుచుకున్నాయని, ఇక పార్టీల కార్యక్రమాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి అని, వైఎస్ఆర్ వర్ధంతి నాడు గుంపులుగా జనం కార్యక్రమాలు నిర్వహించారని వీటన్నిటికీ అడ్డురాని కరోనా మహమ్మారి వినాయకచవితి వేడుకలకు అడ్డం వస్తుందా అంటూ జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగిస్తున్నారు. జగన్ హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో విశ్వహిందూ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్ష
మొన్నటికి మొన్న ఒక వ్యక్తి వినాయకుడికే వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసి నిరసన తెలియజేస్తే, తాజాగా విశాఖలో వినాయక చవితి ఉత్సవాల కు అనుమతి ఇవ్వాలంటూ విశ్వహిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్వహిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి విశ్వహిందూ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద సరస్వతి దీక్ష చేపట్టారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసరియా హిందు వాహిని కూడా ఈ దీక్షలో పాల్గొంది.
చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని వినాయకుడి మౌన దీక్ష .. జగన్ పై స్వామీజీ ధ్వజం
వినాయక చవితి నిర్వహించాలని, వేడుకలకు అనుమతివ్వాలని వినాయకుడు మౌనదీక్ష చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. హిందువుల తొలి పండుగ కు ప్రభుత్వం కరోనా పేరుతో అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాశ్చాత్య దేశాల్లో సైతం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటే, తెలుగు రాష్ట్రంలో ఏంటి ఈ పరిస్థితి అంటూ ఆయన ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా వివక్షేనని, హిందూ ధర్మాన్ని, హిందువుల సంస్కృతిని నాశనం చేస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు.
ఎవరు అడ్డొచ్చినా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని పిలుపు
ఇక ఎవరు అడ్డొచ్చినా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి హిందువు గణేష్ ఉత్సవాలు జరపాలని, అందరూ కలిసికట్టుగా వినాయక ఉత్సవాలను చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ కూడా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించి తీరుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు అంటూ సూచించిన శ్రీనివాసానంద సరస్వతి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ పనిచేస్తోందని మండిపడ్డారు. ఈరోజు సాయంత్రం లోగా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వినాయకచవితిపై ఇతర రాష్ట్రాలలోనూ ఆంక్షలు .. కానీ ఏపీలోనే రగడ
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక కర్ణాటక, కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాలలోనూ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో బహిరంగ వేదికలపై వినాయక చవితి వేడుకలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏపీలో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున రగడ కొనసాగుతుంది. మొదటి నుండీ సీఎం జగన్ ను హిందూ వ్యతిరేకిగా చూస్తున్న క్రమంలోనే జగన్ ను టార్గెట్ చేస్తూ వినాయక చవితి ఉత్సవాలపై రగడ కొనసాగుతుంది. అయితే కేంద్రం ఇచ్చిన సూచనల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, కావాలని ప్రతిపక్షాలు రాష్ట్రంలో మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు సైతం ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.