సభకు ఆయుధాలు, హింసాకాండకు ముద్రగడే బాధ్యుడు: అరెస్ట్కు రంగం సిద్ధం?
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రులు గంటా శ్రీనివాస రావు, చినరాజప్పలతో పాటు సీఐడీ అధికారుల వ్యాఖ్యలను చూస్తుంటే ముద్రగడ అరెస్టు కూడా తప్పకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కాపు గర్జన అరెస్టు అంశంపై సీఐడీ పోలీసులు బుధవారం నాడు స్పందించారు. కాపు నేత ముద్రగడ సభ సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలతోనే కొందరు రెచ్చిపోయారని గుర్తించినట్లుగా చెప్పారు.
కాపు ఐక్య వేదిక హింసాత్మకం కావడానికి ముద్రగడనే కారణమని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రసంగం వల్లే ఆందోళనకారులు రెచ్చిపోయారన్నారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని చెప్పారు. రిమాండ్ డైరీలో వివరాలు ఉన్నాయని చెప్పారు.
కొందరు కుట్రపూరితంగా ఈ మీటింగ్ పెట్టారని చెప్పారు. కొందరు ఆయుధాలు, డీజిల్, పెట్రోలుతో వచ్చారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశామని, మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ కేసులో ముద్రగడ అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
అంతకుముందు మంత్రులు గంటా శ్రీనివాస రావు, చినరాజప్పలు మాట్లాడుతూ... కాపు గర్జనలో జరిగిన హింసాత్మకంపై విచారణ జరుగుతోందని, అరెస్టు చేసిన వారిని ఆధారాలతో అరెస్ట్ చేశారని, వారిని వదిలేది లేదని చెప్పారు. క్రిమినల్స్కు మద్దతు పలుకుతున్న ముద్రగడ కూడా క్రిమినల్ అన్నారు.
కాగా, కాపు గర్జనలో జరిగిన హింసాకాండకు సంబంధించి సీఐడీ అరెస్టడు చేసిన నిందితులు అమాయకులను, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని మంగళవారం నాడు అమలాపురంలో ముద్రగడ బైఠాయించిన విషయం తెలిసిందే. ఇన్ని హైడ్రామాల అనంతరం తుని రిమాండు రిపోర్టు బయటకు వచ్చింది. తుని హింసాకాండకు పూర్తి బాధ్యత ముద్రగడదేనని సీఐడీ తేల్చి చెప్పడం గమనార్హం.