జగన్ రక్తపు చొక్కాను ఈ నెల 23న కోర్టుకు అందించండి:సిట్ కు విశాఖ న్యాయస్థానం ఆదేశం
విశాఖపట్నం:ప్రతిపక్ష నేత జగన్పై ఇటీవల విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం సమయంలో ఆయన ధరించిన చొక్కాను తమకు సమర్పించాలంటూ ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న 'సిట్' అధికారులను విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది.
శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి పందాలకు వినియోగించే కత్తితో జగన్ పై దాడి చేయగా...ఆ దాడిలో జగన్ గాయపడటంతో ఆయన చొక్కాకు రక్తం మరకలు అయ్యాయి. ఆ క్రమంలో జగన్ ఆ చొక్కాను వీఐపీ లాంజ్లోనే మార్చుకుని మరో షర్టు ధరించి విమానంలో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఆ తరువాత అక్కడ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఆ షర్ట్ కోసం ఆదేశాలు జారి చేసింది.
ప్రతిపక్షనేత జగన్ ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరుకావాల్సిన క్రమంలో అక్టోబర్ 25 న విజయనగరం జిల్లాలో పాదయాత్ర అనంతరం హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోగా...ఆయనపై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో జగన్ భుజానికి గాయం కావడంతో రక్త స్రావం జరిగి జగన్ షర్ట్ కు రక్తపు మరక అంటింది.

దీంతో విచారణకు రక్తపు మరకతో కూడిన జగన్ షర్ట్ ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ పోలీసులు సీఆర్పీ సెక్షన్ 91 ప్రకారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం రక్తపు మరకలున్న చొక్కాను సమర్పించాల్సిందిగా విశాఖ సిట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జగన్ ధరించిన షర్టును 23న సమర్పించాలని తమకు ఆదేశాలు అందినట్లు విశాఖ ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు వెల్లడించారు.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ రక్తపు చొక్కాను అందచేయాల్సిందిగా ఆయన పిఎ నాగేశ్వర్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ షర్ట్ ను అందచేసేందుకు వైఎస్ జగన్, లేదా ఆయన పీఏ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని, ఆ చొక్కాను ఎవరైనా తీసుకొచ్చి అప్పగించవచ్చని ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications