ఘోరం: ఆమెపై వరుసగా మేనమామ రేప్, వంతపాడిన తల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మేనమామనే ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. అతనికి అక్క సహకరించడం మరింత ఘోరం. బాలికపై అతను వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మేనమామనే ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. అతనికి అక్క సహకరించడం మరింత ఘోరం. బాలికపై అతను వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇది వరకు ఓసారి అమ్మాయి గర్భం దాలిస్తే అబార్షన్ చేయించారు. మరోమారు ఆమె గర్భవతి అయింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగి బాలికను రక్షించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, బాలసదనానికి తరలించారు.
పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన గిడుతూరి చినబాబు, మాణిక్యం దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. మాణిక్యం తమ్ముడు సోమరాజుకు ఒక యువతితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.
ఏవో కారణాలతో ఆమె పుట్టిల్లుకు వెళ్లిపోయింది. అప్పటినుంచి అక్క ఇంటే సోమరాజు ఉంటున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అక్క కూతురి(16)పై అతను కన్నేశాడు. అక్క, బావ పనులకు వెళ్లిన సమయంలో ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు.
మేనమామ తనను వేధిస్తున్నాడని తల్లికి చెప్పినా ఫలితం లేకుండా పోయింది ఆమె కూడా తమ్ముడికే వంత పాడింది. గర్భం దాల్చిన కూతురును స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. ఈ పరిస్థితుల్లో రెండేళ్లుగా అతను ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం ఐదు నెలల గర్భంతో తిరుగుతున్న బాలికను చూసి, స్థానికులకు అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న రావికమతం ఐసీడీఎస్ అధికారులు బాలిక తల్లి, మేనమామను ప్రశ్నించారు. బాలికను భీమునిపట్నంలోని బాలసదన్కు తరలించారు. సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.