ఉగ్ర కాల్పుల్లో తెలుగు జవాను మృతి: ‘నా తమ్ముడ్ని చంపిన వాళ్లను అంతం చేస్తా’
గురువారం జమ్మూకాశ్మీరులోని కుప్వారాలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో నగరంలోని ఆశివానిపాలేనికి చెందిన బొట్టా వెంకటరమణ మృతి చెందారు.
విశాఖపట్నం: గురువారం జమ్మూకాశ్మీరులోని కుప్వారాలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో నగరంలోని ఆశివానిపాలేనికి చెందిన బొట్టా వెంకటరమణ మృతి చెందారు. ఆయనకు భార్య అనిత, కుమార్తె చిన్మయి (9), కుమారుడు గణేష్(5) ఉన్నారు. వీరిది ఉమ్మడి కుంటుబం కావడంతో ఆయన తల్లిదండ్రులు, సోదరులంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు.
కాగా, మరి కొద్ది గంటల్లో విధులు ముగించుకుని స్వగ్రామమైన విశాఖకు రావల్సిన
వెంకటరమణ మరణ వార్త వినగానే ఆయన కుటుంబంతోపాటు గ్రామస్తులంతా సోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నతనం నుంచే భరతమాతకు సేవ చేయాలని, దేశానికి రక్షణ కల్పించే సైన్యంలో చేరాలనే పట్టుదలతో ముందుకు సాగాడని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

వెంకటరమణ, ఆయన సోదరుడు అప్పలరాజు 18 సంవత్సరాల కిందటే ఆర్మీలో చేరారు.
మూడో సోదరుడు విశాఖలోనే ఆటో నడుపుతున్నాడు. వెంకటరమణ ఆర్మీలో చేరిన తరువాత ఎక్కువ కాలం జమ్మూ కాశ్మీర్లోనే పనిచేశాడు. సుమారు తొమ్మిది సంవత్సరాల కిందట వెంకటరమణకు అనితతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు పిల్లలు చిన్మయి, గణేష్ ఉన్నారు. వెంకటరమణ పదవీకాలం గురువారంతో ముగిసింది.
అయితే, తన సర్వీస్ను ఐదేళ్లపాటు పొడిగించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చేలోగా తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెంకటరమణ శుక్రవారం ఉదయం జమ్మూ నుంచి విశాఖకు బయల్దేరాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బుధవారం రాత్రి వెంకటరమణ స్థానంలో రావల్సిన రిలీవర్ రాలేదు. దీంతో ఆయన విధుల్లో కొనసాగాల్సి వచ్చింది.
మరి కొద్ది గంటల్లో విధుల నుంచి వైదొలిగి, ఇంటికి వెళ్లాల్సిన రమణను ఉగ్రవాదుల రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ మేజర్, మరో ఇద్దరు జవాన్లతోపాటు వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు గురువారం ఉదయం విశాఖలోని రమణ కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
వెంకటరమణ తన సర్వీసును పొడిగించుకోవడమే కాకుండా.... తన పిల్లల్ని కూడా సైన్యంలో చేర్చుతానని చెప్పేవాడని స్నేహితులు కన్నీరుపెట్టుకున్నారు. రమణ మృతదేహం శుక్రవారం విశాఖకు చేరుకోనుంది. అధికార లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి.
నా తమ్ముడ్ని చంపిన వారిని అంతం చేస్తా
'నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా సోదరుడిని చంపిన వారి(ఉగ్రవాదులు)ని నేను చంపేస్తా. లేదా నేనే ప్రాణాలు వదలుతా. నాకు జీతం గానీ, నష్టపరిహారం గానీ అవసరం లేదు. నేను ఈ పని ఉచితంగానే చేస్తా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి' అని రమణ సోదరుడు కోటేశ్వర రావు ఎంతో ఉద్వేగంతో అన్నారు.












Click it and Unblock the Notifications