మహర్దశ: రూ.65 కోట్లతో కింగ్జార్జి, ఆంధ్ర మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు
అమరావతి: విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్జార్జి ఆసుపత్రులకు కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద వైద్య కాలేజీతో పాటు ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు వీలుగా విరాళాలు ఇచ్చేందుకు పలు కార్పోరేట్ కంపెనీలు ముందుకొచ్చాయి.
ఇప్పటికే ఓఎన్జీసీ, సెయిల్, రిలయన్స్, విశాఖ స్టీల్ వంటి సంస్థలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.60 కోట్లకు చేరింది. ఈ విరాళాలతో ఏపీలోనే అత్యంత పురాతనమైన భవనాలైన ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్జార్జి ఆసుపత్రి భవనాలను పూర్తిగా కూలగొట్టి, వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించనున్నారు.

కొత్తగా నిర్మించనున్న కింగ్ జార్జి ఆసుపత్రిని ఏడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. క్రిటికల్ కేర్, రేడియోథెరపీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. మూడవ అంతస్తులో 90 పడకలతో కేన్సర్ విభాగాన్ని, నాల్గవ అంతస్తులో ఐసీయూతో పాటు అనెస్థీషియా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇక, ఆరవ అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, ఏడవ అంతస్తులో 300 మంది సామర్థ్యంతో కూడిన ఓ సమావేశ మందిరంతో పాటు నగదు చెల్లింపులు కోసం ప్రత్యేక గదులు నిర్మించనున్నట్లు ఏపీఎంఎస్ఐడీసీ (మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ)కి చెందిన ఓ అధికారి వివరించారు.

కాగా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తు వరకు రేడియేషన్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్, న్యూక్లియర్ మెడిసిన్ వంటి విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ఏపీ ఎంఎస్ఐడీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్ జార్జి ఆసుపత్రి నిర్మాణ పనులకు సంబంధించిన నవంబర్లోగా టెండర్లను పిలిచి, డిసెంబర్ చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభించాలని వైద్య విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ రెండింటి నిర్మాణాల అంచనా వ్యయం రూ.65 కోట్లని తేల్చారు.












Click it and Unblock the Notifications