మోదీ, పవన్కు ‘మాస్టర్’ స్ట్రోక్ - విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు -సంచలన ప్రకటన, పూర్తి పాఠం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కొనసాగుతోన్న ఉద్యమంలో కీలక మలుపు చోటుచేసుకుంది. విశాఖ ఉక్కును అమ్మి తీరుతామని, ఎవరూ కొనకపోతే ప్లాంటును మూసేస్తామని కేంద్రంలోని మోదీ సర్కార్ హెచ్చరించగా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కేంద్రానికి లేఖరాశారు. ప్లాంటు ప్రైవేటీకరణ ఇక తప్పదని అంతా భావిస్తుండగా, ఉద్యమంలోని 'ఆచార్య' మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ సంచలనంగా మారింది.
విశాఖ ఉక్కుపై సంచలనం: ఉద్యమానికి తెలంగాణ మద్దతు -రాష్ట్ర ప్రభుత్వాలనూ మోదీ అమ్మేస్తాడు: KTR
ఉద్యమానికి చిరు మద్దతు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వెలుగులోకి వచ్చిన మొదట్లో పోరాడుతామన్న బీజేపీ, జనసేనలు.. కేంద్రం వెనక్కి తగ్గడం లేదని తెలిశాక ఆ నిర్ణయం దేశ హితం కోసమేనంటూ ప్లేటు ఫిరాయించాయి. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు రోడ్లపైకొచ్చి ఉద్యమంలో చేరారు. దాదాపు నెలరోజులుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ఉద్యమానికి మద్దతు పిలికారు. ఈ మేరకు బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు.
నా చెవుల్లో నాటి నినాదాలు..
''విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తోన్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. 'విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. ఉద్యమంలో..
త్యాగాల ఫలితం..
దాదాపు 35 మంది పౌరులతోపాటు 9ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. దాన్ని ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం. 'విశాఖ ఉక్కు'కు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం.
కేంద్రానికి చిరు హెచ్చరిక..
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, అందువల్ల నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలలి. ఉద్యోగస్తులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలి'' అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. చివరిగా..
తమ్ముడు పవన్ పరిస్థితేంటి?
పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన చిరంజీవి.. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యమని, ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు అని, ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, చాలా కాలంగా రాజకీయాలతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి చిరు మద్దతు ఇస్తారని కీలక నేతలు చెప్పగా, అన్నయ్య మాత్రం ఇప్పుడు అనూహ్య రీతిలో తమ్ముడితో విభేదిస్తూ, జనంతో గొంతు కలపడం గమనార్హం. చిరంజీవి ప్రకటనను విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతించారు.
షాకింగ్: బెంగాల్ సీఎంపై దాడి -గాయపడ్డ దీదీ -డీజీపీ మార్పు ఎఫెక్ట్ -డ్రామా అంటోన్న బీజేపీ