తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి బాబు: వెంకయ్య ప్రశంసలు, గట్టిగా నవ్విన ఏపీ సీఎం
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు ఓ విజనరీ, మిషనరీ అని, ఓ మంచి ఫర్మార్మర్, రిఫార్మర్ అన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గుర్తిస్తున్నారని చెప్పారు. ఏపీకి 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు.
విశాఖ, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏపీకి బ్రాండ్ లేకపోయినా ఫర్వాలేదని, చంద్రబాబే ఓ బ్రాండ్ అన్నారు. పెట్టుబడుల విషయంలో ఏపీకి సహకరిస్తామని చెప్పారు. ఏపీలో 28న అమృత్, ఒక వారసత్వ నగరాన్ని ఎంపిక చేస్తామన్నారు.
తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ అయితే, ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అన్నారు. హైదరాబాదుకు ఈ బ్రాండ్ వేల్యూ రావడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఉన్నాడన్న విషయం మరువొద్దన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను సుమారు 40 దేశాల బ్రాండ్ అంబాసిడర్లు కలిసి ఉంటారని, వారంతా వివిధ విషయాల గురించి చర్చించిన తర్వాత చంద్రబాబు పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారన్నారు.
చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ వేల్యూ వేరన్నారు. చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తాడని, ఆయన దూరదృష్టి భవిష్యత్ తరాలకు వెలుగునిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, అలాంటి భారత్లో గుజరాత్ తర్వాత ఏపీ పూర్తి స్థాయి పెట్టుబడులు ఆహ్వానిస్తోందన్నారు.
ఏపీలో ఉన్న వ్యాపార నైపుణ్యం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులు భారత దేశం వైపు చూస్తున్నారని చెప్పారు. భారత్ను బలీయమైన ఆర్థిక శక్తిగా అందరూ చూస్తున్నారని చెప్పారు. ఎన్డీయే భాగస్వామి అని మాత్రమే చంద్రబాబుకు సహకరించడం లేదని, ఆయన సంస్కరణవాది.. మంచి ఫలితాలు రాబడతారన్నారు.
వెంకయ్య ప్రశంసలు.. నవ్విన చంద్రబాబు
విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు, వెంకయ్యలు పాల్గొన్నారు. సాధారణంగా విశాఖపట్టణం అనగానే వెంకయ్యకు గొంతులో అవ్యాజ్యమైన ప్రేమ పొంగుతుంది. ఇప్పుడు మరోసారి గతంలోకి వెళ్లారు. ఇక్కడి బీచ్ పైన మాట్లాడేప్పుడు ఆయన అలాంటి భావం కనబరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారు. ఇక్కడే నేను జైలుకెళ్లానని వెంకయ్య చెప్పగానే, చంద్రబాబు గట్టిగా నవ్వేశారు.