చంద్రబాబుపై మా పార్టీ ఎంపీది తప్పు, వారివల్లే గెలిచాం: స్వరంమార్చిన విష్ణు, సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం/అమరావతి: బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాదు, సొంత పార్టీ నేతల తీరునే ఆయన తప్పుబట్టారు. ఆయనకు మొదటి నుంచి టీడీపీ అనుకూల బీజేపీ నేతగా పేరు ఉంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
విజయసాయిరెడ్డితో మొదలు!: అందివచ్చిన అవకాశం, చంద్రబాబుకు జగన్ దెబ్బకు దెబ్బ
పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అలాగే చంద్రబాబు - మోడీ భేటీని వైసీపీ తప్పుబట్టడాన్ని ప్రశ్నించారు. కానీ, ఇదే విష్ణు కుమార్ రాజు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆకుల సత్యనారాయణలు కలిసినప్పుడు టీడీపీ విమర్శలు చేస్తే ఎందుకు బయటకు రాలేదనేది ప్రశ్నగా మారింది. ఆయన తన స్వరం మార్చారు.
మోడీని బాబు కలిస్తే తప్పేమిటి, జీవీఎల్ వ్యాఖ్యలు తప్పు
ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటని విష్ణు కుమార్ రాజు అన్నారు. ప్రతిపక్ష నేతలుగా వెళ్లి మేం కూడా సీఎంను కలుస్తున్నామని, అందులో తప్పేముందన్నారు. సీఎం ఇక్కడ పులి, ఢిల్లీలో పిల్లి అన్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహ రావు వ్యాఖ్యలు సరికాదన్నారు. పనిలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తోందన్నారు. 2019లో మా మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని విష్ణు అన్నారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. బీజేపీ లేకుంటే టీడీపీ అధికారంలో ఉండేది కాదన్నారు. టీడీపీ, జనసేన వల్లే 2014లో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయన్నారు.
చంద్రబాబుకు మానసిక రుగ్మత
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయలేదో చెప్పాలన్నారు. చంద్రబాబు పనితీరుపై బలహీనవర్గాలు రగిలిపోతున్నాయన్నారు.
నాడు మత్స్యకారులను, నేడు నాయీ బ్రాహ్మణులను బెదిరించారు
మత్స్యకారులను ఎస్టీలుగా మార్చాలని కోరితే తోలు తీస్తామని గతంలో చంద్రబాబు బెదిరించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమ వేతనాలు పెంచాలని కోరిన నాయీ బ్రాహ్మణులను అవమానించారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిని పుస్తక రూపంలో రాజకీయ పార్టీల దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఏపీలో పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాకు ముఖం చాటేశారన్నారు. ప్రతి తెలుగువాడు తలదించుకునేలా మోడీకి వంగి వంగి నమస్కారాలు చేశారన్నారు.
పరకాల ప్రభాకర్తో చంద్రబాబు రాజీ డ్రామా
మంత్రి యనమల రామకృష్ణుడు తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు తాము భయపడమని పార్థసారథి అన్నారు. పరకాల ప్రభాకర్, చంద్రబాబు అవినీతిని బయటపెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు పరకాల ప్రభాకర్తో రాజీనామా డ్రామా ఆడిస్తున్నారని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని అమలు చేయలేదన్నారు. హక్కుల కోసం పోరాడితే తోలు తీస్తాం.. తోక కట్ చేస్తామని అనడం సమంజసమా అన్నారు.