విజన్ 2020: చంద్రబాబుతో జోలె పట్టించింది..? ఏడాది మొత్తం జూమ్కే పరిమితం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
2020లో దేశమంతా కరోనాగురించే ఎక్కువగా చర్చించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అంశం హాట్టాపిక్గా నడిచింది. కరోనాపై రాజకీయాలు కూడా బాగానే వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం లెక్కలతో చెబుతుండగా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించింది. ఇక ఈ అంశం పక్కనపెడితే... ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూడా వేడెక్కాయి. 2020 సంవత్సరంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏం చేశారు.. రాజకీయంగా ఎలాంటి పావులు కదిపారు..? ఒక్కసారి రివైండ్ చేసుకుని చూద్దాం.

విజన్ 2020 అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబు
విజన్ 2020... ఇది ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షనేత చంద్రబాబు డ్రీమ్. విజన్ 2020 అంటేనే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు. కొన్నేళ్ల కిందటే విజన్ 2020 అంటే ఏమిటో వివరించిన మేధావి చంద్రబాబు. ఇక 2020 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. తాను అనుకున్న విజన్ 2020ని సాకారం చేద్దామనుకుంటే చంద్రబాబు అధికారంలో లేరు. ఇక ఈ ఏడాది చంద్రబాబు ఏం చేశాడు అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చిన్న యుద్ధమే చేస్తున్నారు.

జూమ్ మీటింగుల ద్వారా...
వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం నుంచే కరోనా భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. ఇందుకు రాజకీయనాయకులు అతీతమేమీ కాదు. ఇక మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో చంద్రబాబు హైదరాబాదులోని తన ఇంటికే పరిమితమయ్యారు. తన కుటుంబం అంతా విజయవాడలోని కరకట్టను వీడి హైదరాబాదులోని జూబ్లీహిల్స్కు షిఫ్ట్ అయ్యింది. అయితే చంద్రబాబు మాత్రం ప్రజల్లో ఉన్నా లేకున్నా తన కర్తవ్యంను మాత్రం వీడలేదు. ఏ నాయకుడు చేయనంతగా ఇంట్లో నుంచే నాయకులకు కార్యకర్తలకు జూమ్ మీటింగ్ ద్వారా దిశా నిర్దేశం చేసేవారు. దీన్నే అధికార వైసీపీ నాయకులు టార్గెట్గా చేసుకుని విమర్శలు సంధించారు. ప్రస్తుతం రాజకీయంగా జూమ్ అనే పదం వినిపిస్తే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు మాత్రమే.

రాజధాని కోసం జోలె పట్టిన చంద్రబాబు
ఈ ఏడాది ఆరంభంలో అంటే 1 జనవరి 2020లో తన భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను ప్రజలను కలిసి వారి ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో సీఎం జగన్పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. వద్దంటే జగన్కు ఓటు వేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని ఇప్పుడు రాష్ట్రాన్ని అదోగతికి తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి భిక్షాటన చేశారు.

చంద్రబాబుపై టీఆర్ఎస్ వైసీపీ సెటైర్లు
ఇక జూమ్ మీటింగుల్లో హైదరాబాదు ఈ రోజు ఈ స్థితిలో ఉందంటే అందుకు ఆద్యుడు తానే అని చెప్పడం, హైదారాబాదుకు విమానాశ్రయం తీసుకొచ్చానని చెప్పడం, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే అందుకు తానే కారణమని చెప్పడంతో ఇటు తెలంగాణలోని అధికారిక టీఆర్ఎస్ పార్టీ కూడా చంద్రబాబుపై సెటైర్లు వేయడం ప్రారంభించింది. చంద్రబాబు ప్రజలకు ఎంటర్టెయినర్గా మారిపోయాడని టీఆర్ఎస్ కీలక నేతలు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇక వైసీపీ నాయకులు అయితే కరోనా దెబ్బకు చంద్రబాబు కరకట్ట వీడారని కూడా సెటైర్లు వేశారు. వాస్తవానికి ఎవరు కాదన్నా ఔనన్నా నాటి చంద్రబాబు చొరవతోనే నగరం హైటెక్ హంగులు అద్దుకుందనిని చాలామంది సీనియర్ విశ్లేషకులు చెబుతుంటారు.

అచ్చెన్నకు, కొల్లి రవీంద్రలకు పరామర్శ
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స ప్రమాద బాధితులను పరామర్శించేందుకు అనుమతి తీసుకున్న చంద్రబాబు, హైదరాబాదు నుంచి బయలు దేరి విజయవాడకు చేరుకుని అక్కడి నుంచే మహానాడు కార్యక్రమం జూమ్ ద్వారా హాజరుకావడంపై పలు విమర్శలు ఎదుర్కొన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడాన్ని వైసీపీ వేలెత్తి చూపింది. ఇక ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఇరుక్కున్న టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనారోగ్యంతో గుంటూరు జీజీహెచ్లో అడ్మిట్ అవ్వగా ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. ఇక హత్యాయత్నం కేసులో బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా చంద్రబాబు పరామర్శించారు.
మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలో రాజధాని కోసం ఉద్యమం చేపట్టి ప్రజల్లో కనిపించిన చంద్రబాబు ఆ తర్వాత కరోనాతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో దాదాపుగా హైదరాబాదులోని తన ఇంటికే పరిమితమయ్యారు.












Click it and Unblock the Notifications