ఇక.. నేను అనంతపురంవాడిని: హీరో వివేక్ ఒబెరాయ్
అనంతపురం: దివంగత పరిటాల రవీంద్ర పదవ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద బాలీవుడ్ సినీ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు నివాళులు అర్పించారు. గ్రామంలో పరిటాల రవి పదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది. మంత్రి సునీత, ఆమె కుటుంబ సభ్యులు రవికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ మాట్లాడారు. తాను ఇక నుండి అనంతపురం జిల్లా వాసినని చెప్పారు. పరిటాల తనకు సోదరుడి వంటి వాడని, అనంతపురం జిల్లా అభివృద్ధిపై ఎన్నో కలలు కన్నారని, పేదలకు ఉచితంగా వివాహాలు జరిపించే వారన్నారు. జిల్లాలోని ముత్తయ్య కుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు.
వెంకయ్యను కలిసిన తుళ్లూరు ప్రాంత రైతులు
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఏపీ రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు శనివారం కలిశారు. తమకు మెరుగైన ప్యాకేజీ ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వెంకయ్య ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానన్నారు.
ఏపీ రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు ప్రాంతంలో మెట్టప్రాంతం ఉన్న రైతులకు ఒక ప్యాకేజీ, జరీబు భూమి ఉన్న రైతులకు మరో ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అసంతృప్తితో ఉన్న జరీబు భూమి రైతులు కేంద్ర మంత్రి వెంకయ్యను కలిసి తమకు ఇచ్చిన ప్యాకేజీని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఉత్సవాల్లో బాలకృష్ణ
విశాఖపట్నంలో జరుగుతున్న విశాఖ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఉత్సవాలను శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.