‘వీసా ఆన్ అరైవల్’: ఇక విశాఖ ఎయిర్పోర్టులోనే వీసాలు
అమరావతి: కేంద్రం మరో రాష్ట్రానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశీయులు ఆంధ్రప్రదేశ్కు రావాలంటే ఇక మీదట వీసా ముందే తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు. 'వీసా ఆన్ అరైవల్' కోసం ఆన్లైన్లో ముందుగానే దరఖాస్తు చేసుకుని వచ్చేయవచ్చు.
Recommended Video

విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాక అక్కడికక్కడే వీసా పొందవచ్చు. ఇందుకు వీలుకల్పిస్తూ... విశాఖపట్నంలో 'వీసా ఆన్ అరైవల్' జారీ చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం వచ్చింది.

అంతేగాక, ఇది వెంటనే అమల్లోకొస్తుందని, సంబంధిత అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శనివారం నుంచి సీఎం చంద్రబాబు ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
సుమారు 147 దేశాల నుంచి విదేశీ పర్యాటకులు వీసా లేకుండానే నేరుగా విశాఖకు వచ్చి, వీసా తీసుకుని రాష్ట్రమంతా పర్యటించవచ్చని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం 17 విమానాశ్రయాల్లోనే ఉండగా ఇప్పుడు విశాఖను అందులో చేర్చినందుకు కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications