సీఎం జగన్ కు కావాల్సిందే ప్రధాని చేసారా - విశాఖ కేంద్రంగా నయా రాజకీయం ..!!
ప్రధాని విశాఖ పర్యటన వేళ ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని ఆహ్వానం..భేటీ ద్వారా పొత్తులు ఏపీలో రిపీట్ అవుతాయంటూ చర్చ తెర మీదకు వచ్చింది. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల తరువాత బీజేపీ - జనసేన మైత్రికి ఏపీలో బీజం పడింది. కానీ, రెండు పార్టీల మధ్య సమన్వయం సరిగ్గా లేదు. దీంతో.. కొద్ది రోజుల క్రితం తాను కోరుతున్న విధంగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వటం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

పవన్ ను ప్రధాని పొలిటికల్ ఫిక్స్
వైసీపీ నేతల పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆ వెంటనే చంద్రబాబు సడన్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ వద్దకు స్వయంగా వచ్చిన చంద్రబాబు.. భవిష్యత్ పొత్తు కు రూట్ క్లియర్ చేయటం ప్రారంభించారు. దీంతో బీజేపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. పవన్ త్వరలోనే తమతో కటీఫ్ చెప్పి టీడీపీతో జత కట్టటం ఖాయమనే అంచనాకు వచ్చారు. దీంతో..పవన్ కు వీడటానికి బీజేపీ నేతలు ఇష్టపడలేదు. పార్టీ నేతల మనోగతం అర్దం చేసుకున్న ప్రధాని..పవన్ కు సమయం ఇచ్చారు. భవిష్యత్ లో జరిగే సమావేశాలకు ఇది తొలి సమావేశంగానే చెప్పుకొచ్చారు. కానీ, పొత్తుల గురించి క్లారిటీ లేదు. టీడీపీ ప్రస్తావన రాలేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనే నమ్మకం బీజేపీ నేతలను గమనిస్తే కలగటం లేదు.

వైసీపీకి కావాల్సింది అదేనా
అదే సమయంలో ప్రధానిని కాదని..పొత్తు వీడి పవన్ బయటకు వెళ్లలేరు. ఇదే సీఎం జగన్ కు కావాల్సింది. బీజేపీ - జనసేన కలిసి పోటీ చేయటం వలన వైసీపీకి పెద్దగా జరిగే నష్టం ఉండదనేది ఆ పార్టీ నేతల అంచనా. టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే గట్టి పోటీ ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే పలు మార్లు వైసీపీ నేతలు పవన్ - చంద్రబాబు కలిసి జగన్ ను ఓడించాలని చూస్తున్నారని.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ - ప్రధానితో సమావేశంలో వైసీపీ ప్రభుత్వ విధానాల పైన ఒక రకంగా ఫిర్యాదు చేసారు. కానీ..రాజకీయంగా తమ ఆలోచనలు ఏంటనేది పవన్ తో ప్రధాని పంచుకోలేదు. ఇటు సీఎం జగన్ తమకు ప్రధానితో ఉన్న సంబంధాలు ఏంటో బహిరంగ సభ వేదికగా స్పష్టం చేసారు.

టీడీపీ తో బీజేపీ పొత్తుకు సిద్దమేనా..
రాష్ట్ర ప్రయోజనాలే తమకు లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీడీపీని కలుపుకొని బీజేపీ తో పాటుగా ముందుకెళ్లి.. జగన్ ను ఓడించాలనేది పవన్ లక్ష్యం. కానీ, ఈ సమావేశంలో ఆ ప్రయత్నం జరగలేదు. రానున్న రోజుల్లో టీడీపీతో తిరిగి కలిసే విషయం పైన బీజేపీ నాయకత్వం ఎప్పుడు స్పష్టత ఇస్తుందో తెలియదు. అప్పటి వరకు బీజేపీని కాదని జనసేన బయటకు వచ్చే అవకాశం లేదు. ఎన్నికల కోసం పార్టీలు ముందుగానే సిద్దమవుతున్న వేళ.. ప్రధానితో సమావేశం జనసేన పార్టీలో ఒక జోష్ పెంచితే.. భవిష్యత్ పొత్తుల పైన డైలమా పార్టీలో కొత్త చర్చ కు కారణమవుతోంది. దీంతో..ఇక నుంచి పవన్ కల్యాణ్ - బీజేపీ నేతల మధ్య జరిగే సమావేశాలు మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది,












Click it and Unblock the Notifications