టీడీపీ మెడకు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య-రాజీనామాలకు సిద్ధమన్న పల్లా శ్రీనివాస్..!
ఏపీలో మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య తెరపైకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ లో కొన్నిరోజులుగా ముడిసరుకు కొరత రావడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ముడిసరుకు కొరత తీరకపోతే ప్లాంట్ మూతపడుతుందన్న వార్తలు వారిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికుల నిరసనలకు ఇవాళ వైజాగ్ ఎంపీ శ్రీభరత్ తో పాటు గాజువాక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ఛీఫ్ కూడా అయిన పల్లా శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు దొరికేలా చేయడంతో పాటు ప్రైవేటీకరణను అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ నేతల్ని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీభరత్, పల్లా శ్రీనివాస్ కార్మికుల్ని కలిసి తమ ప్రయత్నాలను వివరించారు. కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ భరత్ వారికి తెలిపారు. అలాగే పల్లా శ్రీనివాస్ సమస్య పరిష్కారం కాకపోతే రాజీనామా చేసి టెంట్లో కూర్చోవడానికైనా సిధ్దమన్నారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కార్మికులు వారిని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని కార్మికులు కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాట తప్పిన నేతలుగా మీపై కోర్టులకు వెళ్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications