విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం... తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు,స్థానికులు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఏకమై విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని కార్మికులు చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆదేశాలతో విశాఖ వెళ్లి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మనకెందుకులే అని వదిలేస్తే... రేపు మన దాకా వస్తుందన్నారు. తెలంగాణలోని బీహెచ్ఈఎల్,సింగరేణి సంస్థలను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరగవచ్చునని అన్నారు. కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో ప్రతిపక్షాలు కేటీఆర్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రాలో జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించారని ఆరోపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖలో ఇవే ఆరోపణలు చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేటీఆర్ ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా..? అని ప్రశ్నించారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంట్లో పోరాటానికి టీఆర్ఎస్ ఎంపీలు ముఖం చాటేశారని విమర్శించారు. బీజేపీపై గల్లీలో టీఆర్ఎస్ చెప్పే మాటలకు, ఢిల్లీలో చేతలకు పొంతన లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications