మూడు రోజుల్లో పెళ్లి-ఇంతలో కరోనా పాజిటివ్-తిరిగొస్తాడన్న నమ్మకంతో వివాహ ఏర్పాట్లు-చివరకు విషాదాంతం
దేశంలో వందలాది కుటుంబాలను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది. పసిబిడ్డలు మొదలు వృద్దుల వరకూ కరోనా ఎంతోమందిని బలితీసుకుంటున్నది. జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నవారు.. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నవారు.. ఇలా ఎంతోమంది కరోనాతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు మండలంలో 22 ఏళ్ల ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. మరో మూడు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇంతలోనే అతను మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగిల్చింది.
అసలేం జరిగింది....
విజయనగరం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి గ్రామానికి చెందిన చిన్నపాత్రుని మనోహర్(22) ఓ బ్యాంకులో బ్యాంకు మిత్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 23న అతని వివాహం జరగాల్సి ఉంది. కానీ ఈ నెల 13వ తేదీన అతను కరోనా బారినపడటంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. మొదట జ్వరం రావడంతో స్థానిక పీహెచ్సీలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించిన స్థానిక వైద్యురాలు అతన్ని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
తిరిగొస్తాడన్న నమ్మకంతో పెళ్లి ఏర్పాట్లు...
వైద్యురాలి సూచన మేరకు మనోహర్ బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు మనోహర్ అక్కడే చికిత్స పొందాడు. ఇదే క్రమంలో బుధవారం(మే 19) మనోహర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. అర్ధరాత్రి సమయంలో అతను మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మరో మూడు రోజుల్లో పెళ్లి అనగా మనోహర్ కరోనాతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. మనోహర్ తిరిగి వస్తాడన్న నమ్మకంతో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కానీ ఇంతలోనే పిడుగు లాంటి వార్త వారిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఒడిశాలో ఓ నవ వరుడు బలి...
ఇటీవల ఒడిశాలోనూ ఇదే తరహా విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. దుర్గదేబిపాడా గ్రామానికి చెందిన ఆ మృతుడి పేరు సంజయ్. బెంగళూరులో పనిచేస్తున్న సంజయ్కి ఈ నెల 9న పెద్దలు కుదిర్చిన అమ్మాయితో వివాహం జరిగింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకే అతనికి జ్వరం ఇతర కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆరోగ్యం బాగా లేకపోయినా ముహూర్తం ప్రకారం ఈ నెల 12న శోభనం కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాత అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను కన్నుమూశాడు.
తెలంగాణలోనూ ఇదే తరహా ఘటన..
ఇటీవల తెలంగాణలోనూ ఓ నవ వరుడు కరోనాతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లాపల్లికి చెందిన ఓ యువకుడు(25) పెళ్లి అయిన 16 రోజులకే కరోనా కాటుకు బలయ్యాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య,తల్లికి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
Recommended Video