ఓటేస్తే వోల్వో రగడ: కెటిఆర్ అడిగితే జోక్గా.. జెసి క్లారిఫై
హైదరాబాద్: మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి పైన సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చాయి. రాజ్యసభ బరిలో జెసి దివాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందుకోసం ఆయన ఎమ్మెల్యేల సంతకాలు కూడా సేకరించారు.
అయితే, రాజ్యసభ కోసం తనకు ఓటు వేసిన వారికి వోల్వో బస్సు ఇస్తానని జెసి వ్యాఖ్యానించారట. దీనిపై సీమాంధ్ర ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. వోల్వో బస్సు ఇస్తానన్న వ్యాఖ్యలను జెసి ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉపసంహరణ లేఖలు ఇస్తామని, తాము సమైక్యాంధ్ర కోసం జెసికి మద్దతుగా సంతకాలు చేశామని చెబుతున్నారు.

జెసి వివరణ
శాసన సభ లాబీల్లో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయన్నారు. ప్రజలు, అసెంబ్లీలో కాంగ్రెసు పార్టీకి ఏమాత్రం ఇమేజ్ లేదని చెప్పారు. రాజ్యసభ బరిలో ఇతర రాష్ట్రాల వారిని దింపుతారని తాను భావించడంలేదని తెలిపారు. తెలంగాణ బిల్లు పైన చర్చకు ప్రస్తుతం పొడిగించిన వారం రోజుల గడువు చాలన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే బస్సు ఇస్తానని తాను ఎవరితోను చెప్పలేదని జెసి అన్నారు. తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ అడిగితే సరదాగా మాత్రమే అన్నానని తెలిపారు. తనకు మద్దతిచ్చే వారు అపార్థం చేసుకోవద్దని, పిసిసి చీఫ్ బొత్స తనతో మాట్లాడనే లేదన్నారు. ఇలాంటివి కాంగ్రెసు పార్టీలో సహజమేనని తెలిపారు. తాను అందరిని సంప్రదిస్తానని, కావాల్సినంత మద్దతు ఉందన్నారు.
సమైక్యానికే ఓటు: లగడపాటి
సమైక్యవాదానికి మద్దతు పలకకుంటే ప్రజలు ఏ పార్టీని అయినా ఓడిస్తారని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ వేరుగా అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తన స్థానంలో మరొకరిని నిలబెట్టి గెలిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ తర్వాత కూడా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు.
నామినేషన్ దాఖలు చేస్తా: చైతన్య రాజు
తాను రాజ్యసభ రెండో సెట్ పైన ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నానని శాసన మండలి సభ్యులు చైతన్య రాజు అన్నారు. ఈ నెల 27న లేదా 28న తాను నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి గంటా శ్రీనివాస రావు వర్గం చైతన్య రాజును రాజ్యసభ బరిలోకి దింపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోసారి గడువు పెంచరు: జానా రెడ్డి
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మరోసారి గడువు పెంచడం ఉండదని మంత్రి జానా రెడ్డి అన్నారు. వారం రోజులు గడువు పెంచారని, దీనితో నష్టం లేదని చెప్పారు. సభలో ఓటింగుకు అవకాశం లేదన్నారు.












Click it and Unblock the Notifications