పోలీసాఫీసర్లకు వీఆర్: పరిటాల సునీత ఆగ్రహం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ప్రసాద రెడ్డి హత్య కేసులో ఎస్ఐ, సిఐలను వీఆర్కు పంపడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీతకు ఆగ్రహం వచ్చింది. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్మెన్ను, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపించేశారు.
ఆ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని కూడా ఆమె సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ప్రసాద రెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సిఐలను డిఐజి బాలకృష్ణకు విఆర్కు పంపించారు. అదే పరిటాల సునీతకు కోపం తెప్పించింది.
రాప్తాడు మండల వైకాపా మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాదరెడ్డి హత్యకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఇటుకలపల్లి సిఐ కె.శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్లను విఆర్కు పంపిన విషయాన్ని శుక్రవారం ఎస్పీ ఎస్వి రాజశేఖరబాబు ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. జిల్లాలో విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ ఈ హత్యను ముందుగా గుర్తించలేకపోవడంతో పాటు నివారించకపోవడాన్ని సీరియస్గా పరిగణిస్తూ వీరిద్దరినీ విఆర్కు తరలించినట్లు సమాచారం.
రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం, ఈ హత్య విషయం ముందుగా తెలిసినా అడ్డుకోలేకపోయారని ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఎస్ఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే వీరిద్దరినీ విఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.