భువనేశ్వరిపై కామెంట్ల ఎఫెక్ట్- కొడాలి, వంశీ, ద్వారంపూడి, అంబటికి ముప్పు-భద్రత పెంపు
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ మంత్రి కొడాలి నాని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో వీరికి భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మంత్రి కొడాలి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీతో పాటు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీరిని టీడీపీ సానుభూతి పరులు టార్గెట్ చేయొచ్చన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీరందరికీ భద్రత పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వైసీపీ మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం కల్పిస్తున్న సెక్యూరిటీతో పాటు అదనంగా మరికొందరిని చేర్చినట్లు తెలుస్తోంది.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సెక్యూరిటీ ని 1+1 నుండి 3+3 సిబ్బంది పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఇదే మాదిరిగా ప్రభుత్వం భద్రత పెంచినట్లు సమాచారం. వీరందరికీ ప్రాణహాని ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో చంద్రబాబును తిట్టే క్రమంలో వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తన సతీమణి భువనేశ్వరిని సైతం కామెంట్లు చేయడంతో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయిన చంద్రబాబు అనంతరం ప్రెస్ మీట్లో కన్నీరుపెట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారం టీడీపీ శ్రేణులతో పాటు ఆ పార్టీ సానుభూతిపరులు, సాధారణ ప్రజలకు సైతం ఆగ్రహం కలిగించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పలువురు ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం కూడా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రికి ప్రభుత్వం భద్రత కల్పించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.