ఉండవల్లి అరుణ్ కుమార్కు కరోనా పాజిటివ్: హోం ఐసోలేషన్లోకి
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం మరోసారి పదివేల కంటే ఎక్కువ కరోనా కేసులునమోదు కావడంతో 3,82,469కి కరోనా కేసులు చేరుకున్నాయి. ఇప్పటి వరకు కరోనాబారినపడి 3541 మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.
ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడగా.. తాజాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్కు కూడా కరోనా సోకింది. రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో రాజమహేంద్రవరంలోనే హోంఐసోలేషన్ లో ఉంటున్నారు.
ఏపీలో కొత్తగా 10వేలకు పైగా కేసులు, 81 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఏపీనే నిలుస్తుండటం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా ఏపీలోని కొత్త కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 61,838 నమూనాలను పరీక్షించగా రికార్డుస్థాయిలో 10,830 మందికి కరోనా సోకినట్లు తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్లో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 34,18,690 నమూనాలను పరీక్షించగా.. 3,82,469 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1528 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 8473 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3541కి చేరింది.
తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది మరణించగా, ప్రకాశంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8, అనంతపురంలో ఆరుగురు, పశ్చిమగోదావరి ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించినట్లు వైద్యశాఖ తెలిపింది.