ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటీ?- అక్కడే అసలు ట్విస్ట్
బాపట్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 183వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం తాడికొండలో ప్రవేశించారాయన. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కొలికపూడి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్.. ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాజధాని రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు నారా లోకేష్. రైతుల వెతలను అడిగి తెలుసుకున్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాబోతోన్నామని, మళ్లీ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించారు. అమరావతి ప్రాంత రైతుల కోసం ఎంతవరకైనా వెళ్తామనీ తేల్చి చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి. తాడికొండ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శ్రీదేవి.. వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆమెపై వేటు వేసింది వైసీపీ అధిష్ఠానం.
దాని తరువాత ఆమె తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఆమె రాకను చంద్రబాబు స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇస్తాననే హామీ సైతం ఇచ్చారు. బాపట్ల లోక్సభ టికెట్ను ఆమెకు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
తాడికొండ లేదా ప్రత్తిపాడు అసెంబ్లీ టికెట్ కోరుకుంటోన్నారు శ్రీదేవి. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మళ్లీ గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోన్నారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినప్పటికీ.. హామీ దక్కలేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు ఇప్పటికే టికెట్ ఖరారు కావడంతో శ్రీదేవికి మొండిచెయ్యి చూపించినట్టే.
తాడికొండకు ప్రత్యామ్నాయంగా ప్రత్తిపాడు అయినా ఇవ్వాలనేది ఆమె విజ్ఞప్తి. అదీ సాధ్యపడేలా లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అందుకే తనకు టికెట్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టుతున్నారు గానీ సాధ్యపడకపోవచ్చు. ఈ టికెట్ను రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామాంజనేయులుకు ఇస్తారనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవికి బాపట్ల లోక్సభ బరిలో దింపే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సీటుపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. 2019 ఎన్నికల్లో నందిగాం సురేష్.. ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. సీనియర్ నేత శ్రీరామ్ మాల్యాద్రిని మట్టి కరిపించారాయన.
ప్రస్తుతం శ్రీరామ్ మాల్యాద్రి.. రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. ఇక్కడ ఏర్పడిన ఈ లోటును ఉండవల్లి శ్రీదేవితో భర్తీ చేయాలనే అభిప్రాయంలో ఉంది టీడీపీ. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. నందిగాం సురేష్, ఉండవల్లి శ్రీదేవి మధ్య వ్యక్తిగత విభేదాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగాయి. ఇప్పుడామె టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే- అది ఇక రాజకీయ పోటీగా మారుతుంది.












Click it and Unblock the Notifications