ఉద్రిక్తత: పోలీసులతో భూమా అఖిల ప్రియ వాగ్వివాదం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో శుక్రవారంనాడు ఉద్రిక్తత నెలకొంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పోలీస్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీంగ్ కేంద్రానికి వచ్చిన అఖిలప్రియ ఓటు వేయకుండా తన తండ్రి భూమా నాగిరెడ్డి కోసం నిరీక్షించారు. దీనిపై పోలింగ్ అధికారులు, పోలీసులు అభ్యంతరం తెలిపారు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవాలని సూచించారు. ఇందుకు అఖిల ప్రియ నిరాకరించడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. భూమా నాగిరెడ్డి కూడా అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది.
కర్నూలు జిల్లాలోని బండి ఆత్మకూరు ఎంపీటీసీ బాలఉసేనిని కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్థరాత్రి నుంచి బాలఉసేని కనిపించడం లేదని వారు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులే బాలఉసేనిని కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూలు జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో ఓటింగ్ సరళిని పరిశీలించారు.
కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ కర్నూలుపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాన పార్టీ అభ్యర్థులు సహా నలుగురు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుంచి డి.వెంకటేశ్వర్రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు దండు శేషుఫణి యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications