జేసీ X జగన్పార్టీ ఎమ్మెల్యే, టి ఎమ్మెల్యే కారుపై రాళ్లు
అనంతపురం/హైదరాబాద్: అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉరవకొండ శాసన సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎంపీటీసీని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
వారిద్దరు ఉరవకొండలో శుక్రవారం ఎదురు పడ్డారు. ఈ సమయంలో వారు నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఘాటుగా దూషించుకున్నారట. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ శాంత పరిచారు.
అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఎమ్మెల్యే కారుపై రాళ్లు
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు మర్రి జనార్ధన్ రెడ్డి కారు పైన రాళ్ల దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలత ోవాగ్వాదానికి దిగారు. బిజినేపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.
కుట్ర: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అక్రమాలకు యత్నిస్తోందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు శుక్రవారం ఉదయం మండిపడ్డారు. తప్పుడు కేసులతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు.