పవన్ కళ్యాణ్ కు పౌరుషం లేదా?:మంత్రి జవహర్;అక్రమ సంపాదన లేకుంటే భయమెందుకు:విష్ణువర్థన్
అనంతపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే పవన్ కల్యాణ్కు కేంద్రాన్ని ప్రశ్నించే పౌరుషం లేదా?...అని మంత్రి జవహర్ నిలదీశారు.
హిందూపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరైన మంత్రి జవహర్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు,టిడిపి నేతలు దీక్షలు చేయడం తప్పా?...అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ కేంద్రానికి ఐటీ దాడులు ఎందుకు గుర్తు రాలేదని మండిపడ్డారు. మోదీ, జగన్, పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఐటీ దాడుల విషయంలో ప్రజలను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.
సిఎం రమేష్ నివాసంపై ఐటి దాడులపై టిడిపి నేతల విమర్శలకు స్పందించి విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులతో బీజేపీకి ఏమి సంబంధమని...ఆ దాడులతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం రమేష్పై ఐటీ దాడుల విషయం బీజేపీ నేతలకు ముందే తెలుసంటూ ప్రజలను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఎంపీలు ఏపీని అవినీతిలో నెంబర్వన్ చేశారని విష్ణువర్థన్ దుయ్యబట్టారు. లేకుంటే ఎక్కువ సోదాలు ఏపీలోనే ఎందుకు జరిగాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. అభివృద్ధి అంటే అవినీతి అనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. టిడిపి నేతలకు అక్రమ సంపాదన లేకపోతే, ప్రజల సొమ్ము దోచుకోకపోతే...మరి ఐటీ దాడులకు ఎందుకు ఇంతగా భయపడుతున్నారని ఆయన నిలదీశారు.
Recommended Video
ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదని పునరుద్ఘాటించిన విష్ణువర్థన్ రెడ్డి...టిడిపి తమ స్వార్థ రాజకీయాల కోసం ఎపి ప్రజలను దారుణంగా మోసగిస్తోందని ధ్వజమెత్తారు.