బ్యాంకు చోరీ కేసు: 36కిలోల బంగారం, 19లక్షలు సీజ్
వరంగల్: జిల్లాలోని భూపాలపల్లి ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ అటెండర్ రమేష్ను నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. బ్యాంకు నుంచి ఎత్తుకెళ్లిన 34 కిలోల బంగారం, 19 లక్షల నగుదును కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలోని తన బంధువుల ఇంట్లో దాచిపెట్టాడు నిందితుడు.
ఈ విషయాన్ని గుర్తించిన తనిఖీ చేసి పోలీసులు ఆ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో స్వాధీనం చేసుకున్న సొత్తును పోలీసులు లెక్కించారు. గత శనివారం బ్యాంకులో ఈ సొత్తు చోరీకి గురైంది.

వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ఝా ఈ చోరీకి సంబంధించిన వివరాలను ఇటీవల తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలో ఏపీజీవీబీ పట్టణ శాఖ, కారల్మార్క్స్ కాలనీలో ఆజంనగర్ గ్రామీణ శాఖ బ్రాంచిలు ఉన్నాయి. శనివారం సాయంత్రం బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన అధికారులు సోమవారం ఉదయం వచ్చి చూసే సరికి షట్టర్తో పాటు లాకర్లు తెరిచి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
భూపాలపల్లి ఎస్సై వెంకట్ బ్యాంకుకు చేరుకుని పరిశీలించారు. అనంతరం వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్కిశోర్ఝా, ములుగు డీఎస్పీ మురళీధర్లు సంఘటన స్థలానికి చేరుకుని బ్యాంకు అధికారులతో చర్చించారు.
ఈ చోరీల్లో రెండు బ్యాంకుల్లో ఉన్న రూ.20లక్షల నగదుతోపాటు సుమారు రూ. ఐదు కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైనట్లు ఎస్పీ చెప్పారు. తాళాలు పగలగొట్టి లేవని, లాకర్ల తాళాలు తీసి మరీ దొంగలు చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications