నారాయణ అరెస్టుతో టార్గెట్ ఫినిష్ అయ్యిందా.. నెక్ట్స్ ఎవరు..?
ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అరెస్ట్లు జరుగుతాయో ఎవరికీ తెలియదు.. ఏ కేసుమీద అరెస్ట్ చేస్తున్నారో అసలు తెలియదు.. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందు కేసు ఎక్కడ నమోదైంది? ఎవరు నమోదు చేశారు? దాని పరిణామాలేంటి? ఇలాంటివన్నీచర్చించుకొని పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తారు. కానీ ఏపీలో అరెస్టుల విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది.

అరెస్టుల వెనక క్లారిటీ మిస్
ఏపీలో మూడు సంవత్సరాలుగా పోలీసులు స్వచ్ఛందంగా చేసిన అరెస్ట్లు లేవని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే అరెస్ట్లు జరుగుతాయి. అరెస్టైన తర్వాత వారిని ఎక్కడ ఉంచుతారో అసలే తెలియదు. కోర్టులు జోక్యం చేసుకున్న తర్వాతే అరెస్ట్ అయినవారిని అయిష్టంగా బయటకు పంపిస్తారు. కొన్నాళ్లుగా ఏపీలో ఇదే తంతు అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గంటకో మాట చెప్పిన పోలీసులు
తాజాగా నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను సీఐడీ పోలీసులు హైదరాబాద్లో ఉంటే అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. ముందుగా పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా మీడియాకు లీక్ చేశారు. ఆ తర్వాత మళ్లీ మీడియాకు ఎఫ్ఐఆర్ను లీక్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్కింద తిరుపతిలో కేసు నమోదైనట్లుగా ఆ ఎఫ్ఐఆర్లో ఉంది. చిత్తూరు జిల్లాలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ గిరిధర్ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా పదోతరగతి ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించారు.

పెద్దలు చెబుతారు..పోలీసులు పాటిస్తారు
ప్రిన్సిపాల్ ఫోన్ నుంచి ప్రశ్నాపత్రం లీకైతే యజమానిని అరెస్ట్ చేయడం వింతగా ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. కేసు విచారించకుండా, పరిశోధించకుండా తమకు గిట్టనివారు యజమానిగా ఉంటే అరెస్ట్ చేయడం జరుగుతోందని, పెద్దలు చెబుతారు.. పోలీసులు పాటిస్తారని ఇక రాష్ట్రంలో న్యాయానికి చోటెక్కడుందని ప్రశ్నిస్తున్నారు.

టార్గెట్ చేశారు.. సాధించారు
పాత కేసులు కాదని ల్యాండ్ పూలింగ్ కేసు కింద నారాయణను అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవాలు మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదని టీడీపీ వాపోతోంది. ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు జరగలేదని కోర్టే చెప్పింది. కానీ నారాయణ అక్కడ ఏ అక్రమాలకు పాల్పడ్డారో మూడు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం విచారించి వాటిని ఎందుకు బయటకు తీయలేకపోయారో వారికే తెలియాలని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నారు.. చేశారు.. టార్గెట్ చేశారు.. అనుకున్నది సాధించారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications