ఆంధ్రప్రదేశ్ లో...నేటి నుంచి జల సంరక్షణ ఉద్యమం...116 రోజులు
అమరావతి: ఎపి ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జల సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా
ప్రభుత్వం ఈ జల సంరక్షణ ఉద్యమాన్నిసిద్దం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 రోజుల పాటు భారీ స్థాయిలో ఈ జల సంరక్షణకు సంబంధించిన పనులు నిర్వహించనున్నారు.
రాజధాని నగరం అమరావతి పరిధిలో పాలవాగు వద్ద సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొంటారు.

రాష్ట్రాన్ని కరువు రహితంగా మలిచేందుకు ప్రజలకు అవసరమైన తాగు, సాగు నీటి అవసరాలు తీర్చడం...పారిశ్రామిక అవసరాల కోసం నీటిని అందించడం...నీరు-ప్రగతి, నీరు-చెట్టు వంటి కార్యక్రమాలను ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జల సంరక్షణ కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 116 రోజుల పాటు సాగే ఈ జల సంరక్షణ కార్యక్రమంలో ఈ నెల మూడో వారం నుంచి సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు.
ఈ జల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా నదీ జలాలను ప్రాజెక్టులలోనూ, చెరువుల్లోనూ నిల్వ చేయడంపై దృష్టి సారిస్తారు. అందుకోసం చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి పనులు, చెక్డ్యామ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే భూగర్భ జలాల పరిస్థితిపై విశ్లేషించనున్నారు.












Click it and Unblock the Notifications